ఇది మీ ప్రభుత్వం.. రెడ్ల ప్రభుత్వం: కోన
ABN , First Publish Date - 2022-07-01T09:16:37+05:30 IST
ఇది మీ ప్రభుత్వం.. రెడ్ల ప్రభుత్వం: కోన
బాపట్ల, జూన్ 30: ‘‘రెడ్డి సామాజిక వర్గం వారు పదవులు రాలేదని బాధ పడొద్దు. ఇది రెడ్ల ప్రభుత్వం. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను కలుపుకొని వెళ్లాలి. పార్టీని బలహీన పరిచే విధంగా, వ్యతిరేకంగా మాట్లాడే వారిని గుడ్డలూడతీసి కొడతారు’’ అని వైసీపీ ప్లీనరీ సమావేశంలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి హెచ్చరించారు. బాపట్ల ప్లీనరీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంట్రాక్టర్లకు డబ్బులు రాలేదనే ప్రచారం సరికాదన్నారు. బాపట్ల నియోజకవర్గంలో 14వ ఆర్థిక సంఘం నిధులు, ఎన్ఆర్ఈజీఎస్ నిధులు మొత్తం క్లియర్ అయ్యాయన్నారు. నాన్ ప్రయార్టీలో ఉన్న సీసీ రోడ్లు, డ్రైనేజీలకు సంబంధించిన డబ్బులు 22 మంది కాంట్రాక్టర్లు లేదా నాయకులకు రూ.7 కోట్లు మాత్రమే పెండింగ్లో ఉన్నాని స్పష్టం చేశారు. వైసీపీలోని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ముఖ్య నాయకులు గాదె వెంకటరెడ్డి, చీరాల గోవర్ధనరెడ్డి, మోదుగుల బసవపున్నారెడ్డిలతోపాటు మరికొందరు ప్లీనరీకి రాకపోవటం చర్చనీయాంశమైంది.