తుపాను బాధిత రైతులకు త్వరలో నష్టపరిహారం

ABN , First Publish Date - 2022-05-17T04:57:55+05:30 IST

ఇటీవల సంభవించిన అసాని తుపాను ప్రభావం తో కురిసిన వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు త్వరలోనే నష్టపరిహారం అందిస్తామని కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు తెలిపారు.

తుపాను బాధిత రైతులకు  త్వరలో నష్టపరిహారం
రైతు భరోసా నగదు చెక్కును అందజేస్తున్న కలెక్టర్‌, పక్కన మేయర్‌ తదితరులు

కలెక్టర్‌ చక్రధర్‌బాబు

‘రైతు భరోసా - పీఎం కిసాన్‌’ నిధుల విడుదల


నెల్లూరు(వ్యవసాయం), మే 16 : ఇటీవల సంభవించిన అసాని తుపాను ప్రభావం తో కురిసిన వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు త్వరలోనే నష్టపరిహారం అందిస్తామని కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు తెలిపారు. వైఎస్‌ఆర్‌ రైతు భరోసా - పీఎం కిసాన్‌ పథకానికి సంబంధించి నాలుగో విడత నిధులను ముఖ్యమంత్రి జగన్‌ ఏలూరు జిల్లా గనపవరం నుంచి సోమవారం మీటనొక్కి విడుదల చేశారు. ఈ సందర్భంగా నెల్లూరు లోని కస్తూర్బా కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడుతూ రైతు భరోసా నాలుగో విడతలో ఒక్కో రైతుకు రూ.5500 చొప్పున 2,05,587 మంది రైతుల ఖాతాల్లోకి  రూ.113కోట్లు జమ చేసినట్లు చెప్పారు. మిగిలిన రూ.2వేలను ఈనెలాఖరులోగా అందజేస్తామన్నారు. దేశ వ్యాప్తంగా విద్యుత్‌ కొరత ఉన్నప్పటికీ రాష్ట్రంలో రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్‌తోపాటు ఆక్వా రైతులకు ప్రభుత్వం సబ్సిడీ విద్యుత్‌ అంది స్తోందని తెలిపారు. అనంతరం వ్యవసాయశాఖ ఏర్పాటు చేసిన కూరగాయలు, యంత్ర పరికరాల స్టాళ్లను కలెక్టర్‌ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్‌ స్రవంతి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ దొడ్డంరెడ్డి నిరంజన్‌రెడ్డి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ వీరి చలపతి, జిల్లా వ్యవసాయాధికారి సుధాకర్‌రాజు, మత్స్య, పశుసంవర్థకశాఖల జేడీలు నాగేశ్వరరావు, మహేశ్వరుడు, ఉద్యానశాఖ అధికారి శ్రీనివాసరావు, ఏపీఎంఐపీ అధికారి సుభానీ, ఏడీఏ అనిత తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-17T04:57:55+05:30 IST