భారత ప్రయాణికులకు Oman భారీ ఊరట!
ABN , First Publish Date - 2021-10-28T14:14:57+05:30 IST
భారత ప్రయాణికులకు గల్ఫ్ దేశం ఒమన్ భారీ ఊరటనిచ్చింది.
మస్కట్: భారత ప్రయాణికులకు గల్ఫ్ దేశం ఒమన్ భారీ ఊరటనిచ్చింది. కోవాక్సిన్ తీసుకున్నవారు సైతం ఒమన్ వెళ్లేందుకు మార్గం సుగమమైంది. తమ దేశంలో ఆమోదం పొందిన కరోనా వ్యాక్సిన్ల జాబితాలో కోవాక్సిన్ను కూడా చేర్చుతున్నట్లు తాజాగా ఒమన్ ప్రకటించింది. కనుక కోవాక్సిన్ తీసుకున్నవారు ఎలాంటి సందేహం లేకుండా సుల్తానేట్కు వెళ్లొచ్చు. అంతేగాక కోవాక్సిన్ వేసుకున్న భారతీయులకు క్వారంటైన్ నుంచి కూడా మినహాయింపు ఇచ్చింది ఒమన్ సర్కార్. ఈ మేరకు తాజాగా ఒమన్లోని భారత ఎంబసీ కీలక ప్రకటన విడుదల చేసింది.
జర్నీకి 14 రోజుల ముందు రెండో డోసు తీసుకున్నవారికి కూడా ఒమన్లో ప్రవేశానికి అనుమతి ఉంటుందని ఈ సందర్భంగా రాయబార కార్యాలయం వెల్లడించింది. అయితే, ఇతర కరోనా నిబంధనలు ముఖ్యంగా ప్రయాణానికి ముందు ఆర్టీ-పీసీఆర్ టెస్టు వంటివి తప్పనిసరి అని ఎంబసీ పేర్కొంది. ఇక ఇప్పటికే కోవిషీల్డ్ టీకా తీసుకున్నవారికి ఒమన్లో ప్రవేశానికి అనుమతి ఉన్న విషయం తెలిసిందే. తాజాగా కోవాక్సిన్ వ్యాక్సిన్కు కూడా ఆమోదం లభించడంతో ఒమన్ వెళ్లే భారతీయులకు భారీ ఉపశమనం లభించినట్లైంది. ఈ సందర్భంగా రాయబార కార్యాలయం ఒమన్ ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసింది.