తొలిసారిగా వెయ్యి డ్రోన్లతో ఫ్లయ్ పాస్ట్
ABN , First Publish Date - 2022-01-24T06:34:55+05:30 IST
గణతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించడానికి ఇండియన్ ఆర్మీ సన్నాహాలు చేస్తోంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ను పురస్కరించుకుని ఈసారి వేడుకల్లో అనేక ప్రత్యేకతలు..
గణతంత్ర వేడుకలకు ఘనంగా సన్నాహాలు
న్యూఢిల్లీ, జనవరి 23: గణతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించడానికి ఇండియన్ ఆర్మీ సన్నాహాలు చేస్తోంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ను పురస్కరించుకుని ఈసారి వేడుకల్లో అనేక ప్రత్యేకతలు చోటుచేసుకోనున్నాయి. ఇందులో భాగంగా 1950 నుంచి ఇప్పటివరకు సైన్యం ధరించిన వివిఽధ రకాల యూనిఫామ్లతో ఫార్మేషన్స్ ఉంటాయి. నాటి నుంచి నేటివరకు వాడుకలో ఉన్న పలు రకాల రైఫిల్స్ను సైనికులు ధరించనున్నారు. ఆరు సైనిక బృందాలు ఇందులో పాల్గొననున్నాయి. రాజ్పుట్ రెజిమెంట్ 1950 నాటి యూనిఫామ్ను, అసోం రెజిమెంట్ 1960 నాటి యూనిఫామ్ను, జమ్మూ కశ్మీర్ లైట్ ఇన్ఫ్యానీ్ట్ర (పదాతిదళం) 1970 నాటి యూనిఫామ్ను, సిక్కు లైట్ ఇన్ఫ్యానీ్ట్ర, ఆర్మీ ఆర్డ్నెన్స్ దళాలు ప్రస్తుతం ఆర్మీ ధరిస్తున్న ఆలివ్ గ్రీన్ యూనిఫామ్ను ధరిస్తాయి. ఈ నెల 15న విడుదల చేసిన కొత్త యూనిఫామ్ను పారాచ్యూట్ రెజిమెంట్ ధరించనుంది. 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకుని త్రివిధ దళాలకు చెందిన 75 ఎయిర్క్రా్ఫ్టలతో ఫ్లయ్ పాస్ట్ను నిర్వహిస్తారు. ఇక.. ఉత్సవాల ముగింపులో భాగంగా ఈ నెల 29న జరగనున్న బీటింగ్ రిట్రీట్ వేడుకల్లో.. తొలిసారిగా వెయ్యి డ్రోన్లను ఈ వేడుకల్లో ప్రదర్శించనున్నారు. ఐఐటీ ఢిల్లీకి చెందిన బోట్లాన్బ్ అనే స్టార్టప్ కంపెనీ వీటిని తయారుచేసింది. కాగా, బీటింగ్ రిట్రీట్ వేడుకల్లో వినిపించే ‘ఎబైడ్ విత్ మీ’ అనే ఇంగ్లీషు శ్లోకానికి బదులుగా భారత కవి ప్రదీప్ రాసిన ‘ఏ మేరే వతన్ కే లోగోఁ’ శ్లోకాన్ని వినిపించాలని కేంద్రం నిర్ణయించింది. కాగా, 1950 నుంచి వినిపిస్తున్న ఇంగ్లీషు శ్లోకాన్ని తొలగించడం విచారకరమని, ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని కాంగ్రెస్ నేత పి.చిదంబరం అన్నారు.