హత్యాయత్నం కేసులో ముగ్గురి అరెస్ట్‌

ABN , First Publish Date - 2022-05-25T05:16:24+05:30 IST

నగరంలోని ఇరుగోళమ్మ సంఘం పెట్రోల్‌ బంకు ఎదురుగా జరిగిన హత్యాయత్నం కేసులో చిన్నబజారు పోలీసులు ముగ్గురు నిందితులను మంగళవారం అరెస్టు చేశారు.

హత్యాయత్నం కేసులో ముగ్గురి అరెస్ట్‌
నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు

నెల్లూరు(క్రైం), మే 24:  నగరంలోని ఇరుగోళమ్మ సంఘం పెట్రోల్‌ బంకు ఎదురుగా జరిగిన హత్యాయత్నం కేసులో చిన్నబజారు పోలీసులు ముగ్గురు నిందితులను మంగళవారం  అరెస్టు చేశారు. చిన్నబజారు పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ ఎ. సైదులు నిందితుల వివరాలను విలేకరులకు తెలిపారు. ‘నగరంలోని టైలర్స్‌కాలనీకి చెందిన వి. సురేష్‌ స్టీల్‌ వెల్డింగ్‌ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు మూలాపేట బ్రహ్మణవీధికి చెందిన విజయ్‌, కొండదిబ్బ మున్సిపల్‌ క్వార్టర్స్‌కు చెందిన ఎం. అరుణ్‌పాండే, సింహాద్రిలతో పాతగొడవలున్నాయి. ఈనెల 22న సురేష్‌ తన స్నేహితుడు షామీర్‌తో కలిసి ఇరుగోళమ్మసంఘం పెట్రోల్‌ బంకు ఎదురుగా ఉన్న చిల్లర దుకాణం వద్ద ఉండగా విజయ్‌, అరుణ్‌పాండే, సింహాద్రి చేరుకుని కొబ్బరి బోండాలు నరికే కత్తితో సురేష్‌పై దాడి చేశారు. సురేష్‌ కుడికన్నుకు తీవ్రగాయమైంది. స్థానికులు రావడాన్ని గమనించిన ముగ్గురు నిందితులు అక్కడ నుంచి పరారయ్యారు. సురేష్‌ను అతని స్నేహితులు చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. బాధితుడు చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హత్యాయత్నం కేసు నమోదు చేశారు. సీఐ పర్యవేక్షణలో ఎస్‌ఐ సైదులు నిందితుల కోసం గాలిస్తుండగా మంగళవారం ఇరుగోళమ్మ సంఘం సమీపంలో స్వర్ణాల చెరువు వద్ద విజయ్‌, అరుణ్‌పాండే, సింహాద్రిలను అరెస్ట్‌ చేసి వారి నుంచి హత్యాయత్నానికి వినియోగించిన కత్తినిస్వాధీనం చేసుకున్నారు’ అని ఎస్‌ఐ వివరించారు.

Updated Date - 2022-05-25T05:16:24+05:30 IST