నెల్లూరు జిల్లాలో ముగ్గురు బాలికలు అదృశ్యం

ABN , First Publish Date - 2021-03-06T09:31:23+05:30 IST

ఆడుకునేందుకు బయటకు వెళ్లిన ముగ్గురు బాలికలు కనబడకుండా పోయిన ఘటన నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండలం పోట్లపూడి గిరిజన కాలనీలో జరిగింది.

నెల్లూరు జిల్లాలో ముగ్గురు బాలికలు అదృశ్యం

ఇద్దరు అనుమానితులపై పోలీసులకు ఫిర్యాదు


తోటపల్లిగూడూరు, మార్చి5: ఆడుకునేందుకు బయటకు వెళ్లిన ముగ్గురు బాలికలు కనబడకుండా పోయిన ఘటన నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండలం పోట్లపూడి గిరిజన కాలనీలో జరిగింది. కాలనీకి చెందిన సుబయ్య, సుబ్బమ్మల కుమార్తె ఉప్పల చెంచురావమ్మ(15), సుభాషిణి కుమార్తె ఉప్పల శీనమ్మ (8), వరదయ్య, వెంకటసుబ్బమ్మల కుమార్తె తులసి (12) గురువారం రాత్రి ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. ఈ క్రమంలో అక్కచెల్లెళ్లతోపాటు వారి స్నేహితురాలు కూడా కనిపించలేదని తెలిసింది.


దొరువులు, బావులు, చెరువుల వద్ద సైతం  గాలించినా ఫలితం లేకపోవడంతో తల్లిదండ్రులు తోటపల్లిగూడూరు పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. అదృశ్యమైన బాలికల ఇళ్లకు సమీపంలోనే నివాసం ఉంటున్న గంధళ్ల వెంకటసుబ్బయ్యతో పాటు గణేష్‌ అనే యువకుడు గురువారం రాత్రి నుంచీ కనిపించకపోవడంతో వారిపై సందేహం వ్యక్తంచేశారు. ఈ ఇద్దరు యువకులు కొంతకాలంగా అదృశ్యమైన బాలికలతో సన్నిహితంగా ఉండటంతో, వారేమైనా చేసి ఉంటారని భావిస్తున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. మూడు బృందాలతో గాలిస్తున్నట్లు కృష్ణపట్నం సీఐ ఖాజావలి తెలిపారు.

Updated Date - 2021-03-06T09:31:23+05:30 IST