వేర్వేరు ఘటనల్లో చెరువుల్లో పడి ముగ్గురి మృతి

ABN , First Publish Date - 2021-10-17T04:58:39+05:30 IST

సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో వేర్వేరు ప్రాంతాల్లోని చెరువుల్లో పడి ముగ్గురు మృతి చెందారు.

వేర్వేరు ఘటనల్లో చెరువుల్లో పడి ముగ్గురి మృతి

సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో  వేర్వేరు  ప్రాంతాల్లోని చెరువుల్లో పడి ముగ్గురు మృతి చెందారు. వీరిలో ఇద్దరు మహిళలు బలవన్మరణం చెందగా, ఒక యువకుడు  ప్రమాదవశాత్తు నీట మునిగి మరణించాడు.  మనోహరాబాద్‌ మండలం కోనాయపల్లి(పీటీ) గ్రామంలో ఓ వ్యక్తి  భార్యతో గొడవపడి చెరువులో పడినట్లుగా గ్రామస్థులు అనుమానిస్తున్నారు.  ఈ మేరకు గాలింపు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే..


చేపలు పట్టేందుకు వెళ్లి యువకుడు మృతి

గుమ్మడిదల, అక్టోబరు 16: చెరువులో పడి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామంలో శనివారం చోటు చేసుకొంది. ఎస్‌ఐ విజయ్‌ క్రిష్ణ వివరాల ప్రకారం..  బొంతపల్లి గ్రామానికి చెందిన సత్తారపు సందీప్‌(22) ఈ నెల 14న రాత్రి 9 గంటల ప్రాంతంలో గ్రామ శివారులోని వీరన్న చెరువులోకి చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో గల్లంతు కాగా, శుక్రవారం మృతదేహం లభ్యమైంది. మృతుడి తండ్రి పిర్యాదు మేరకు కేసు  దర్యాప్తు చేస్తున్నట్లు  ఎస్‌ఐ తెలిపారు. 


 కడుపు నొప్పి భరించలేక మహిళ ఆత్మహత్య

కల్హేర్‌, లక్టోబరు 16: కడుపు నొప్పి భరించలేక చెరువులో దూకి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. శనివారం ఎస్‌ఐ ప్రశాంత్‌ తెలిపిన వివరాల మేరకు.. కల్హేర్‌ మండల పరిధిలోని బాచేపల్లి గ్రామానికి చెందిన లొద్ద అంజమ్మ(45) కొంత కాలంగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నది. ఆసుపత్రుల్లో చూపించినా ఫలితం లేకపోయింది. శుక్రవారం కడుపునొప్పి భరించలేక గ్రామ శివారులోని ఊర చెరువులో పడి  ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి భర్త లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


జీవితంపై విరక్తితో మహిళ..

చేగుంట, అక్టోబరు  16: జీవితంపై విరక్తి చెందిన ఓ మహిళ గురువారం రాత్రి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. శనివారం చేగుంట ఎస్‌ఐ సుభాష్‌ గౌడ్‌ వివరాల ప్రకారం.. కర్నాల్‌ పల్లి గ్రామానికి చెందిన వడ్ల యాదమ్మ(55) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నది.  జీవితంపై విరక్తి చెంది గ్రామ శివారులోని చెరువులో పడి మృతి చెందింది. శనివారం ఉదయం చెరువులో మృతదేహం తేలింది. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు 


కోనాయపల్లి చెరువులో వ్యక్తి కోసం గాలింపు

తూప్రాన్‌ (మనోహరాబాద్‌), అక్టోబరు 16: భార్యతో గొడవపడి వెళ్లిన ఓ యువకుడు చెరువులో పడినట్లుగా అనుమానిస్తున్నారు. ఈ సంఘటన మనోహరాబాద్‌ మండలం కోనాయపల్లి (పీటీ)లో శనివారం జరిగింది. మనోహరాబాద్‌ ఎస్‌ఐ రాజుగౌడ్‌, గ్రామస్థుల వివరాల ప్రకారం... మనోహరాబాద్‌ మండలం కోనాయపల్లి (పీటీ) గ్రామానికి చెందిన మోతుకుస్వామి (33) శనివారం మద్యం సేవించి ఇంటికొచ్చాడు.  దీంతో అతడి భార్య అనిత గొడవ పడింది. మనస్థాపానికి గురైన స్వామి చెరువులో పడిపోతానంటూ మధ్యాహ్నం చెరువు వైపు వెళ్లాడు. గ్రామానికి చెందిన దుర్గం భానుచందర్‌గౌడ్‌ చెరువు కట్టమీదుగా వెళుతున్న సమయంలో చెరువులో నుంచి పెద్ద బుడగలు రావడం గుర్తించాడు. అదే సమయంలో చెరువు కట్ట వద్ద ఉన్న మోతుకు స్వామి కుమారుడైన వరుణ్‌ (8)ను ఇక్కడేందుకు ఉన్నావంటూ ప్రశ్నించగా, మా నాన్న చెరువులో పడి చచ్చిపోతానంటూ వచ్చాడని చెప్పాడు. చెరువు కట్ట వద్ద స్వామి చెప్పులు ఉండటంతో చెరువులో దూకి ఉండవచ్చని గ్రామస్థులు  అనుమానిస్తున్నారు. కాగా చెరువులో గాలించినా రాత్రి వరకు ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. ఆదివారం ఉదయం గాలిస్తామని చెప్పారు. 


Updated Date - 2021-10-17T04:58:39+05:30 IST