దూబే కేసులో ముగ్గురు పోలీసులపై వేటు
ABN , First Publish Date - 2020-07-07T07:45:20+05:30 IST
గ్యాంగ్స్టర్ వికాస్ దూబేను అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసుల గురించి అతడికి ముందుగానే సమాచారం ఇచ్చారన్న ఆరోపణలపై మరో ముగ్గురు యూపీ పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది...
కాన్పూర్/లఖ్నవూ/గ్వాలియర్, జూలై 6: గ్యాంగ్స్టర్ వికాస్ దూబేను అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసుల గురించి అతడికి ముందుగానే సమాచారం ఇచ్చారన్న ఆరోపణలపై మరో ముగ్గురు యూపీ పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. పోలీసుల సమాచారాన్ని లీక్ చేసిన ఆరోపణలపై చౌబేపూర్ పోలీసు స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్లు కన్వర్పాల్, కృష్ణకుమార్ శర్మ, కానిస్టేబుల్ రాజీవ్ను సోమవారం సస్పెండ్ చేసినట్లు అధికారులు చెప్పారు. కాగా, దూబే ఆచూకీ తెలిపిన వారికి రివార్డును రూ.2.5 లక్షలకు పెంచుతున్నట్లు పోలీసులు చెప్పారు. గ్యాంగ్స్టర్ దూబేకు చెందిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. యూపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ హరికృష్ణ శ్రీవాస్తవ తన రాజకీయ గురువని, ఆయనే తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చారని గతంలో ఒక ఇంటర్వ్యూలో అతడు చెప్పినట్లు తెలుస్తోంది. తాను నేరస్థుడిని కాదని, నేరస్థులతోనూ ఎలాంటి సంబంధాలు లేవన్నాడు.