టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలుగు వారు దుర్మరణం!

ABN , First Publish Date - 2020-11-29T17:12:43+05:30 IST

అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రంలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగువారు దుర్మరణం చెందారు.

టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలుగు వారు దుర్మరణం!

టెక్సాస్‌: అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రంలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగువారు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులను నారాయణపేట జిల్లా మరికల్ మండలం పెద్దచింతకుంట గ్రామానికి చెందిన దంపతులు నరసింహా రెడ్డి, లక్ష్మి, వీరి కుమారుడు భరత్‌గా గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే... దంపతులు నరసింహా రెడ్డి, లక్ష్మికి మౌనిక, భరత్‌లు ఇద్దరు సంతానం. వీరిద్దరూ టెక్సాస్‌లో ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడ్డారు. ఈ క్రమంలో నాలుగు నెలల క్రితం నరసింహా రెడ్డి దంపతులు కుమారుడు, కుమార్తె వద్దకు వెళ్లారు. శనివారం బంధువుల ఇంట్లో జరిగిన ఓ శుభ కార్యానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 


ఈ దుర్ఘటనలో దంపతులతో పాటు కుమారుడు భరత్ అక్కడికక్కడే చనిపోయారు. తీవ్రంగా గాయపడిన కూతురు మౌనికతో పాటు హైదరాబాద్‌కు చెందిన మరో వ్యక్తి సాయిప్రణీత్‌ లింగమనేని ప్రస్తుతం సమీపంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సాయిప్రణీత్ పరిస్థతి విషమంగా ఉంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో వారి స్వగ్రామంలో విషాదం అలుముకుంది. కాగా, నరసింహా రెడ్డి తెలంగాణ ఆర్‌టీసీ ఉద్యోగి అని తెలుస్తోంది. 

Updated Date - 2020-11-29T17:12:43+05:30 IST