Justice Armugaswamy's letter: మరో మూడువారాలు గడువివ్వండి
ABN , First Publish Date - 2022-08-03T13:28:27+05:30 IST
మాజీ ముఖ్యమంత్రి జయలలిత(Former Chief Minister Jayalalithaa) మృతి, అపోలో ఆస్పత్రిలో ఆమెకు 75 రోజులపాటు అందించిన చికిత్సపై
- రాష్ట్ర ప్రభుత్వానికి జస్టిస్ ఆర్ముగస్వామి లేఖ
చెన్నై, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి జయలలిత(Former Chief Minister Jayalalithaa) మృతి, అపోలో ఆస్పత్రిలో ఆమెకు 75 రోజులపాటు అందించిన చికిత్సపై విచారణ జరుపుతున్న మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ముగస్వామి(Justice Armugaswamy) కమిటీ మరి కొంత గడువు కావాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. నిజానికి ఈ కమిటీ విచారణ గడువు బుధవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో మరో మూడువారాల గడువు కోరుతూ జస్టిస్ ఆర్ముగస్వామి మంగళవారం లేఖ రాశారు. ఈ కమిటీ ఇప్పటికే అపోలో డాక్టర్లు, జయలలిత సన్నిహితురాలు శశికళ సహా 154 మందిని విచారించింది. అయితే విచారణ పూర్తికాలేదు. దీనికితోడు జయ మృతిపై వైద్య కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరపాలని ఎయిమ్స్ నిర్వాహక కమిటీకి సుప్రీంకోర్టు(Supreme Court) ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు ఎయిమ్స్ వైద్యనిపుణుల కమిటీ పలువురిని విచారణ జరిపింది. అయితే ఆ వైద్య బృందం తన నివేదికను జస్టిస్ ఆర్ముగస్వామి కమిటీకి సమర్పించలేదు. ఈ నివేదికను సమర్పించేందుకు వారం రోజులపాటు గడువు కావాలని మూడు రోజులకు ముందు ఎయిమ్స్ వైద్యనిపుణుల కమిటీ జస్టిస్ ఆర్ముగస్వామి కమిటీకి విజ్ఞప్తి చేసింది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని విచారణ కమిటీ గడువును మరో మూడు వారాలపాటు పొడిగించాలని జస్టిస్ ఆర్ముగస్వామి ప్రభుత్వానికి లేఖ రాశారు.