Dubai లో ముగ్గురు మహిళలకు 3ఏళ్ల జైలు.. ఒక్కొక్కరికి రూ.58లక్షల జరిమానా.. ఇంతకీ వారు చేసిన నేరమేంటంటే..

ABN , First Publish Date - 2021-10-28T18:59:38+05:30 IST

ముగ్గురు ఆఫ్రికన్ మహిళల విషయంలో తాజాగా దుబాయ్ క్రిమినల్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.

Dubai లో ముగ్గురు మహిళలకు 3ఏళ్ల జైలు.. ఒక్కొక్కరికి రూ.58లక్షల జరిమానా.. ఇంతకీ వారు చేసిన నేరమేంటంటే..

దుబాయ్: ముగ్గురు ఆఫ్రికన్ మహిళల విషయంలో తాజాగా దుబాయ్ క్రిమినల్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. వారికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి 2.84లక్షల దిర్హామ్స్(సుమారు రూ.58లక్షలు) జరిమానా విధించింది. అలాగే శిక్షకాలం పూర్తి అయిన వెంటనే దేశం నుంచి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఇంతకీ వారు చేసిన నేరమేంటో తెలుసా? ఓ ఐటీ నిపుణుడిని తప్పుడు సందేశాలతో వారు ఉంటున్న చోటుకు పిలిచి దోపిడీకి పాల్పడడమే. గతేడాది నవంబర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన కేసు తాజాగా దుబాయ్ కోర్టులో విచారణకు రావడంతో దోషిగా తేలిన ముగ్గురు మహిళలకు న్యాయస్థానం శిక్షను ఖరారు చేసింది. 


వివరాల్లోకి వెళ్తే.. ముగ్గురు ఆఫ్రికన్ మహిళలు ఓ జట్టుగా ఏర్పడి Tawasul మెసేజ్ సెంటర్ పేరిట తమ వద్ద అందుబాటులో ఉన్న మొబైల్ నెంబర్లకు మొదట సందేశాలు పంపించేవారు. చిన్న విచారణ ఉందని, వెంటనే రావాల్సిందిగా ఓ అడ్రస్ పంపించేవారు. అలా వారు పంపించిన అడ్రస్‌కు వెళ్లిన వారిని భయపెట్టి, హింసించి బాధితుల నుంచి అందినకాడికి దోచుకునేవారు. ఈ క్రమంలో గతేడాది నవంబర్‌లో ఇదే మాదిరి ఓ ఐటీ నిపుణుడికి సందేశం పంపించారు ఆ ముగ్గురు కీలాడీలు. దాంతో ఆ వ్యక్తి మరుసటి రోజు వారు చెప్పిన చోటు వెళ్లాడు. అక్కడికి వెళ్లి చూస్తే నలుగురు మహిళలు కనిపించారు. అందులో ఓ మహిళ లోపలికి వెళ్లగానే ఎంత డబ్బు తీసుకోచ్చావని అడిగింది. దాంతో అతనికి అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని మొబైల్ తీయబోయాడు. అది గమనించిన మరో మహిళ అతడి ఫోన్ లాగేసుకుంది. అనంతరం ఫోన్ పాస్‌కోడ్ చెప్పాలని అడిగింది. దానికి ఆయన నిరాకరించాడు. 


దాంతో నలుగురు కలిసి ఆయనను ఓ చైర్‌కు కట్టేసి హింసించడం మొదలెట్టారు. చివరకు చేసేదేమి లేక ఫోన్ ఓపెన్ చేసి ఇచ్చాడు. అందులోని బ్యాంక్ యాప్ తెరిపించి వారి వేర్వేరు బ్యాంకు ఖాతాలకు 25వేల దిర్హామ్స్(రూ.5లక్షలు) ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు. ఆ తర్వాత అతన వద్ద ఉన్న బ్యాంకు డెబిట్ కార్డు తీసుకుని మరో 30వేల దిర్హామ్స్(రూ.6లక్షలు) డ్రా చేసుకున్నారు. ఒకరోజు వారి వద్దనే ఉంచుకునే ఆ తర్వాతి రోజు బాధితుడిని వదిలిపెట్టారు. దీంతో బయటకు వచ్చిన ఆ వ్యక్తి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దోపిడీకి పాల్పడిన నలుగురు మహిళల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిపై దోపిడీ, దాడి కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసు దుబాయ్ క్రిమినల్ కోర్టులో విచారణకు వచ్చింది. ముగ్గురు మహిళలు తమ నేరాన్ని అంగీకరించడంతో న్యాయస్థానం వారికి శిక్షను ఖరారు చేసింది. మూడేళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ. రూ.58లక్షల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. అంతేగాక శిక్షకాలం పూరైన తక్షణమే దేశం విడిచిపెట్టి వెళ్లిపోవాలని ఆదేశించింది. 

Updated Date - 2021-10-28T18:59:38+05:30 IST