T20 World Cup 2022: ఐదు నిమిషాల్లో అమ్ముడుపోయిన భారత్-పాక్ మ్యాచ్ టికెట్లు

ABN , First Publish Date - 2022-02-08T23:46:15+05:30 IST

ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌ టికెట్ల వేలం ప్రారంభమైంది.

T20 World Cup 2022: ఐదు నిమిషాల్లో అమ్ముడుపోయిన భారత్-పాక్ మ్యాచ్ టికెట్లు

న్యూఢిల్లీ: ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌ టికెట్ల వేలం ప్రారంభమైంది. రెండు మ్యాచ్‌ రోజుల కోసం సాధారణ టికెట్లను విక్రయానికి పెట్టగా ఒక్క రోజులోనే హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఈ ఏడాది అక్టోబరు 16 నుంచి నవంబరు 13 వరకు పొట్ట ప్రపంచకప్ జరగనుండగా ఈసారి ఆస్ట్రేలియా ఆతిథ్యమిస్తోంది.


ప్రపంచకప్‌లో భాగంగా అక్టోబరు 23న చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాకిస్థాన్ మధ్య మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లను విక్రయానికి పెట్టిన ఐదు నిమిషాల్లోనే అమ్ముడయ్యాయంటే ఆ మ్యాచ్‌కు ఉన్న డిమాండ్ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. అలాగే, అక్టోబరు 27న దక్షిణాఫ్రికా-బంగ్లాదేశ్, ఇండియా-గ్రూప్-ఎ రన్నరప్ మధ్య సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనున్న మ్యాచ్‌ల టికెట్లు కూడా అమ్ముడుపోయాయి.


టీ20 ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియా తొలిసారి ఆతిథ్యమిస్తోంది. ఈ టోర్నీలో మొత్తం 45 మ్యాచ్‌లు జరగుతాయి. ప్రీ-సేల్ పిరియడ్‌లో మొత్తం 2 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి. ఈ ప్రపంచకప్‌కు మొత్తం 8 లక్షల మంది ప్రేక్షకులు హాజరవుతారని అంచనా. మెల్‌బోర్న్, సిడ్నీ, బ్రిస్బేన్, అడిలైడ్, గీలాంగ్, హోబర్ట్, పెర్త్‌ల వంటి ఏడు వేదికలపై మ్యాచ్‌లు జరుగుతాయి.

Updated Date - 2022-02-08T23:46:15+05:30 IST