లచ్చిరెడ్డిపాలెం పరిసరాల్లో పెద్దపులి
ABN , First Publish Date - 2022-06-27T06:36:32+05:30 IST
పెద్దపులి అటవీశాఖాదికారులకు ముచ్చెమటలు పట్టిస్తూనే ఉంది. వారి అంచనాలకు వ్యతిరేకంగా ప్రయాణిస్తుంది. రౌతులపూడి మండలం ఎస్.పైడిపాల ఊటగెడ్డవద్ద 3 రోజుల పాటు మకాం వేసింది. శనివారం పులి జాడ కనిపించకపోవడంతో సార్లంక రిజర్వు ఫారెస్టు మీదుగా నర్సీపట్నం డివిజన్కు వెళ్లిందని అటవీ శాఖాధికారులు భావించారు.
రౌతులపూడి, జూన్ 27: పెద్దపులి అటవీశాఖాదికారులకు ముచ్చెమటలు పట్టిస్తూనే ఉంది. వారి అంచనాలకు వ్యతిరేకంగా ప్రయాణిస్తుంది. రౌతులపూడి మండలం ఎస్.పైడిపాల ఊటగెడ్డవద్ద 3 రోజుల పాటు మకాం వేసింది. శనివారం పులి జాడ కనిపించకపోవడంతో సార్లంక రిజర్వు ఫారెస్టు మీదుగా నర్సీపట్నం డివిజన్కు వెళ్లిందని అటవీ శాఖాధికారులు భావించారు. అయితే పులి ఎస్.పైడిపాల ఊటగెడ్డ నుంచి ఏటికాలువ మీదుగా గుమ్మరేగల శివారు పొలాల ద్వారా పయనించినట్లు తెలుస్తోంది. బలరాంపురం గ్రామ శివారు పాదాలమ్మ ఆలయ ఎదురుగా పుంత, ఎ,మల్లవరం పామాయిల్ తోటలో నుంచి లచ్చిరెడ్డిపాలెం ఎర్రచెరువుకు చేరుకున్నట్టు పాద ముద్రలు ఆధారంగా అధికారులు గుర్తించారు. నల్లకొండ వద్ద గల పొట్టిమెట్ట వద్ద ఉండవచ్చని భావిస్తున్నారు. బలరాంపురం శివారు పాదాలమ్మ ఆలయం ఎదురుగా పుంతలోంచి పులి వెళ్లే సమయంలో లారీ డ్రైవర్కు సైతం కనిపించింది. ఎస్.పైడిపాల నుంచి వచ్చే మార్గమధ్యంలో రైతులు పశువుల మకాల వద్ద పశువులు ఉన్నప్పటికి ఎటువంటి దాడి చేయలేదు. పులి జాడ తెలుసుకునేందుకు అటవీఅధికారులు 5 బృందాలుగా ఏర్పడి పరిశీలిస్తున్నారు. ఎన్ఎన్పట్నం, లచ్చిరెడ్డిపాలెం, ఎస్.అగ్రహారం, ఎన్వీ నగరం గ్రామాల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని... పశువులు, మేకలను కొండల్లోకి తీసుకెళ్లొద్దని సూచించారు. అచ్చిరెడ్డిపాలెం ఎర్ర చెరువు వద్ద తోటలో పులి ఉందనే సమాచారంతో గ్రామస్థులు అధిక సంఖ్యలో ఆదివారం ఎర్ర చెరువు వద్దకు తరలివెళ్లారు. వారిని నివారించేందుకు పోలీ్సలు ఇబ్బందులు పడ్డారు.
విద్యుత్ షాక్కు గురయ్యే ప్రమాదం?
నల్లకొండ పక్క పొట్టిమెట్టపై మకాం వేసిన పులి విద్యుత్ షాక్కు గురయ్యే ప్రమాదం ఉందని ఆ ప్రాంత వాసులు భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో కొండలు ఎక్కువగా ఉన్నాయి. లచ్చిరెడ్డిపాలెం-వెంకటనగరం మధ్యలో గొంతుకొండ, శృంగదార, లచ్చిరెడ్డిపాలెంలో నల్లకొండ, ఎన్వీనగరం-ఎన్ఎన్పట్నం మధ్యలో నల్లకొండ,పెద్దకొండ ఉన్నాయి. ఈ ప్రాంతంలో వన్యప్రాణులను వేటాడేందుకు వేటగాళ్లు విద్యుత్ తీగలను అమర్చుతారు. గతంలో విద్యుత్తీగలకు ప్రజలు బలైన సంఘటనలు కూడా ఉన్నాయి.