ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో గట్టి బందోబస్తు, ట్రాఫిక్ ఆంక్షలు
ABN , First Publish Date - 2022-06-30T22:50:34+05:30 IST
Hyderabad: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్లో జరగనున్నాయి. జూలై 2,3 తేదీల్లో హైటెక్స్లోని నోవాటెల్ హోటల్లో జాతీయ
Hyderabad: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్లో జరగనున్నాయి. జూలై 2,3 తేదీల్లో హైటెక్స్లోని నోవాటెల్ హోటల్లో ఈ సమావేశాలు జరుగుతాయి. పార్టీ జాతీయ నేతలు శివప్రకాశ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్, జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, ఇతర ముఖ్య నేతలు సమావేశాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో మోదీ బహిరంగ సభ జరగనుంది.
ఈ నేపథ్యంలో జూలై 1 నుంచి 4 వ తేదీ వరకు పోలీసులు నగరంలోని పలు చోట్ల గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు. ఎస్పీజీతో పాటు ఇతర బలగాలను బందోబస్తుగా ఉంచుతున్నారు. నోవాటెల్ పరిసర ప్రాంతాల్లో నాలుగు లేయర్ల బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాని వెళ్లే రూట్లో ప్రత్యేక నిఘా ఉంచారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
‘‘రెండు ఆర్గనైజేషన్లు ప్రధాని టూర్లో ధర్నా చేస్తారన్న సమాచారం ఉంది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా.. ప్రశాంతంగా, సాఫీగా ప్రధాని పర్యటన ముగిసేలా జాగ్రత్తలు తీసుకుంటాం. సోషల్ మీడియాపై ప్రత్యేక మానిటరింగ్ ఉంటుంది. ప్రధాని ఎక్కడ స్టే చేస్తారనే విషయాన్ని సెక్యూరిటీ రీత్యా బయటకి చెప్పలేం.’’ అని సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర పేర్కొన్నారు.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల షెడ్యూలు ఇదీ..
జూలై 1: మధ్యాహ్నం 3 గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుంటారు. 3.30 గంటలకు శంషాబాద్ పట్టణం నుంచి దాదాపు 2 కిలోమీటర్ల మేర రోడ్షోలో పాల్గొని 4 గంటలకు హెచ్ఐసీసీ లోని నోవాటెల్ హోటల్కు చేరుకుంటారు. తెలంగాణ సంస్కృతి-సంప్రదాయాలు, తెలంగాణ ఉద్యమం-బీజేపీ పోరాటాలకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను నడ్డా ప్రారంభిస్తారు.రాత్రి 7 గంటలకు నోవాటెల్లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులతో నడ్డా సమావేశం. జాతీయ కార్యవర్గ సమావేశాల ఎజెండా, ప్రతిపాదిత తీర్మానాలపై సమీక్ష. రాత్రి 8.30 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు.
జూలై 2: ఉదయం 10 గంటలకు జాతీయ పదాధికారుల సమావేశం ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుంది. 4 గంటలకు జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమవుతాయి.బేగంపేట విమానాశ్రయానికి ప్రధాని మోదీ చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా నోవాటెల్ చేరుకుంటారు.
జూలై 3: ఉదయం 10 గంటలకు జాతీయ కార్యవర్గ సమావేశాల కొనసాగింపు. సాయంత్రం 4 గంటలకు మోదీ ముగింపు ఉపన్యాసం. 4.30 గంటలకు పరేడ్ గ్రౌండ్స్లో విజయ సంకల్ప సభ. ప్రధాని మోదీ, అమిత్షా, నడ్డాతోపాటు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత సీఎంలు పాల్గొంటారు.
జూలై 4: పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శుల సమావేశం. ప్రధాని నరేంద్ర మోదీ ఉదయం బయలుదేరి భీమవరం వెళతారు.
మోడీ సభకు 10 లక్షల మందిని తరలించేలా ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ మొత్తాన్ని కాషాయమయంగా మార్చేందుకు హార్డింగ్స్, భారీ ఫ్లెక్సీలతో నింపేందుకు ప్రణాళికలు చేస్తున్నారు.