మహాకవీ.. మన్నించు!!ఆలనా పాలనలేని తిక్కన పార్కు

ABN , First Publish Date - 2021-02-25T07:27:00+05:30 IST

పెన్నా తీరంలోని తిక్కన పార్కు ఆలనా పాలనకు నోచుకోక అధ్వానంగా తయారైంది. సంస్కృత మహాభారతంలో సింహ భాగాన్ని మహాకవి తిక్కన ఆంధ్రీకరించిన ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనలు కార్యరూపానికి నోచుకోవడం లేదు

మహాకవీ..  మన్నించు!!ఆలనా పాలనలేని తిక్కన పార్కు

ప్రతిష్ఠకు నోచుకోని కాంస్య విగ్రహం


నెల్లూరు(సాంస్కృతిక ప్రతినిధి), ఫిబ్రవరి 24 : పెన్నా తీరంలోని తిక్కన పార్కు ఆలనా పాలనకు నోచుకోక అధ్వానంగా తయారైంది. సంస్కృత మహాభారతంలో సింహ భాగాన్ని  మహాకవి తిక్కన ఆంధ్రీకరించిన ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనలు కార్యరూపానికి నోచుకోవడం లేదు. ఆహ్లాదకరంగా ఉండాల్సిన ఉద్యానవనం పశువుల కొట్టాంలా మారింది. చీకటి కార్యకలాపాలకు కేంద్రం అయింది. మనుమసిద్ధి రాజుల కాలంనాటి జ్ఞాపకాలు, ఆధారాలు, చరిత్ర సాక్ష్యాలను ఆధునీకరణ పేరుతో చెరిపేశారు. తిక్కన మహాభారత రచనా మందిరాన్ని భూస్థాపితం చేశారు. నూతన నిర్మాణానికి 2015లో అట్టహాసంగా శంకుస్థాపన చేసినా ఆ తర్వాత పనులు ముందుకు సాగలేదు. తిక్కన నడయాడిన నేలపై ఆ మహనీయుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో రెండేళ్ల క్రితం కాంస్య విగ్రహాన్ని తెప్పించారు. ఈ విగ్రహ తయారీకి సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ విశేష కృషి చేశారు. కానీ ఆ బింబం ఇప్పటికీ ప్రతిష్ఠకు నోచుకోవడం లేదు. తిక్కన విగ్రహాన్ని గానీ, ఆయన జ్ఞాపకాలను గానీ నేటి తరానికి పరిచయం చేసేందుకు పాలకులు ముందుకురాకపోవడం సాహితీవేత్తలను, చరిత్రకారులను ఆవేదనకు గురిచేస్తోంది. 



Updated Date - 2021-02-25T07:27:00+05:30 IST