ఈ ‘కండిషన్‌’ ఇంకెన్నేళ్లు?

ABN , First Publish Date - 2020-09-22T17:48:52+05:30 IST

సాగు భూములున్నాయి.. సబ్సిడీ విత్తనాలూ, ఎరువులూ అందవు. ఇబ్బందులకోర్చి సాగు చేస్తున్నారు. కానీ పెట్టుబడికి పంట రుణాలివ్వరు. ఎన్ని కష్టనష్టాలకోర్చినా ఈ రైతులకు ఏ ‘భరోసా’ ఉండదు.. కారణం వారు కండిషన్డ్‌ పట్టాలు కలిగి ఉండడమే.

ఈ ‘కండిషన్‌’ ఇంకెన్నేళ్లు?

కృష్ణా జిల్లాలో అర లక్ష ఎకరాల భూములకు కండిషన్డ్‌ పట్టాలు 

ఆంగ్లేయుల కాలంలో ఇచ్చిన పట్టాలు 

స్వాతంత్ర్యానంతరం కూడా అవే నిబంధనలు

నిషేధిత భూముల జాబితాలో చేర్చడంతో రైతులకు కష్టాలు

పంట రుణాలు లేవు.. సబ్సిడీ విత్తనాలు, ఎరువులు అందవు

నిబంధనలు మార్చాలని రైతుల డిమాండ్‌


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): సాగు భూములున్నాయి.. సబ్సిడీ విత్తనాలూ, ఎరువులూ అందవు. ఇబ్బందులకోర్చి సాగు చేస్తున్నారు. కానీ పెట్టుబడికి పంట రుణాలివ్వరు. ఎన్ని కష్టనష్టాలకోర్చినా ఈ రైతులకు ఏ ‘భరోసా’ ఉండదు.. కారణం వారు కండిషన్డ్‌ పట్టాలు కలిగి ఉండడమే. వందల ఏళ్ల నాటి రెవెన్యూ చట్టాల్లో మార్పులేని కారణంగా జిల్లాలో కండిషన్డ్‌ పట్టాలు కలిగిన వేలాది మంది రైతులు ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహాయాన్నీ పొందలేకపోతున్నారు. వీరి భూములను, స్థలాలను కండిషన్డ్‌ పట్టాల పేరుతో నిషేధిత జాబితాలో చేర్చడంతో జిల్లాలో వేలాదిమంది రైతులు, స్థలాల యజమానులు తీవ్ర ఇబ్బందులనెదుర్కొంటున్నారు. 


జిల్లావ్యాప్తంగా దాదాపు అర లక్ష ఎకరాల భూములు, స్థలాలకు కండిషన్డ్‌ పట్టాలున్నాయి. బ్రిటీషు కాలంలో రెవెన్యూ చట్టం ఏర్పడింది. నాటి భూ రికార్డులే ఇప్పటికీ ప్రామాణికంగా ఉంటున్నాయి. నాడు బ్రిటీష్‌ పాలకులు సైన్యంలోనూ, వివిధ రూపాల్లో సేవలు అందించిన వారికి కండిషన్డ్‌ పట్టాలను ఇచ్చారు. ఈ భూములను వంశపారంపర్యంగానే అనుభవించాలి. ఎటువంటి క్రయ విక్రయాలూ జరపకూడదని పేర్కొన్నారు. స్వాతంత్య్రం రాకముందు వరకు ఇలా పట్టాలను పొందిన వారు ఎలాంటి లావాదేవీలు నిర్వహించలేదు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ పట్టాలు చేతులు మారాయి. అవసరాల ప్రాతిపదికన విక్రయించుకున్నారు. ఆ తరువాత అనేక చేతులు మారాయి. వీటిని నిషేధిత భూముల జాబితాలో చేర్చటంతో ప్రస్తుతం హక్కుదారులు, అనుభవదారులుగా ఉన్న వేలాదిమంది రైతులు, స్థలాల యజమానులు ఇబ్బందులనెదుర్కొంటున్నారు. ఈ భూములను సాగు చేసుకునే రైతులకు బ్యాంకుల నుంచి పంట రుణాలను పొందే అవకాశం లేదు. సబ్సిడీ విత్తనాలు, ఎరువులను కూడా అందుకోలేక పోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకానికి కూడా అర్హత సాధించలేకపోతున్నారు. 


మచిలీపట్నం రెవెన్యూ డివిజన్‌లోనే అత్యధికం  

మచిలీపట్నం రెవెన్యూ డివిజన్‌లో అత్యధికంగా కండిషన్డ్‌ పట్టాలున్నాయి. మచిలీపట్నం, కృత్తివెన్ను, బంటుమిల్లి, కోడూరు, నాగాయలంక తదితర ప్రాంతాల్లో 15 వేలకు పైగా ఎకరాల భూములు కండిషన్డ్‌ పట్టాలుగా ఉన్నాయి. తూర్పు కృష్ణాలోని తీర ప్రాంతంలో అధికంగా ఈ పట్టాలున్నాయి.  తూర్పు కృష్ణాలో 30 వేలు, పశ్చిమ కృష్ణాలో 20 వేల ఎకరాలున్నాయి. 


కౌలు రైతుల ప్రయోజనాలకు కూడా దూరం

కౌలు రైతుల కోసం ప్రభుత్వం సీసీఆర్‌సీ (క్రాప్‌ కల్టివేషన్‌ రైట్స్‌ యాక్ట్‌)ను అమలు చేస్తోంది. దీని ద్వారా కౌలు రైతులకు బ్యాంకుల నుంచి వ్యవసాయ రుణాలు, సబ్సిడీ విత్తనాలు, ఎరువులు అందుతాయి. ఈ ప్రయోజనాలను కూడా కండిషన్డ్‌ పట్టా భూముల రైతులు అందుకోలేక పోతున్నారు. ఉద్దేశపూర్వక తప్పులేమీ తాము చేయలేదని, ఈ మతలబులు తెలియక ఎంతో మంది చేతులు మారిన భూమి ఇప్పుడు తమ చేతుల్లో ఉంటే తమను బాఽధ్యులను చేసి నష్ట పరచడం తగదని రైతులు అంటున్నారు. 

Updated Date - 2020-09-22T17:48:52+05:30 IST