పదవీ కాలం పూర్తయ్యే వరకు..

ABN , First Publish Date - 2022-06-25T07:18:47+05:30 IST

పదవీ కాలం పూర్తయ్యే వరకు ప్రస్తుత ఉమ్మడి జిల్లా ప్రజా పరిషత్‌ యథావిధిగా కొనసాగనుంది. రాష్ట్రంలోని జిల్లా ప్రజా పరిషత్‌ల పదవీ కాలం పూర్తయ్యే వరకు యథావిధిగా కొనసాగించేందుకు శుక్రవారం జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో తీర్మానం చేశారు.

పదవీ కాలం పూర్తయ్యే వరకు..
కాకినాడలోని జిల్లా పరిషత్‌ కార్యాలయం (ఫైల్‌ ఫొటో)

  • ఉమ్మడి జిల్లా ప్రజా పరిషత్‌గానే కొనసాగింపు
  • ప్రస్తుత జడ్పీ చైర్మనే ఉమ్మడి జడ్పీ ఆఖరి చైర్మన్‌ 
  • రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీర్మానం 

కాకినాడ సిటీ, జూన్‌ 24: పదవీ కాలం పూర్తయ్యే వరకు ప్రస్తుత ఉమ్మడి జిల్లా ప్రజా పరిషత్‌ యథావిధిగా కొనసాగనుంది. రాష్ట్రంలోని జిల్లా ప్రజా పరిషత్‌ల పదవీ కాలం పూర్తయ్యే వరకు యథావిధిగా కొనసాగించేందుకు శుక్రవారం జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో తీర్మానం చేశారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా రాష్ట్రం లో కొత్త జిల్లాలు ఆవిర్భవించాయి. అందులో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మూడు జిల్లాలుగాను, ఏజెన్సీ మరో జిల్లాగానూ రూపాంతరం చెందాయి. ఈ క్రమంలో కొత్త జిల్లాలకు కలెక్టరేట్‌లు, ఇతర పరిపాలనా వ్యవస్థ అందుబాటులోకి తెచ్చారు. కానీ జిల్లా ప్రజా పరిషత్‌లను మాత్రం విభజించకుండా ఉమ్మడి  జడ్పీలుగానే ఉంచారు. ప్రస్తుత జడ్పీ పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టి ఏడాది కూడా పూర్తి కాలేదు. ఈ తరు ణంలో కొత్త జిల్లాలకు జడ్పీ చైర్మన్‌ల ఎంపిక, పాలన వ్యవస్థ ప్రయాసతో కూడుకున్నదనే భావనతో రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జడ్పీ వ్యవస్థనే కొనసాగించేందుకు మొగ్గు చూపిందని విశ్లేషకులు భావిస్తున్నారు. మంత్రివర్గ తీర్మానంతో ఉమ్మడి తూర్పుగోదా వరి జడ్పీపై ఉత్కంఠ వీడింది. దీంతో ప్రస్తుత జడ్పీ చైర్మనే ఉమ్మడి జడ్పీ ఆఖరి చైర్మన్‌ కానున్నారు. వందేళ్ల చరిత్రగల ఈ వ్యవస్థ జిల్లా బోర్డు, జిల్లా పరిషత్‌, జిల్లా ప్రజాపరిషత్‌గా అప్‌గ్రేడ్‌ అయ్యింది. 1917 సంవత్సరం నుంచి 1953 సంవత్సరం వరకు జిల్లా బోర్డుగా కొనసాగింది. ఈ కాలంలో దివాన్‌ బహద్దూర్‌ దురుశేటి శేషగిరిరావు, రావు బహద్దూర్‌ మాదిరెడ్డి వెంకటరత్నం నాయుడు, రావు బహద్దూర్‌ పోకల గోవిందరావు నాయుడు వంటి మహామహులతోపాటు మల్లిపూడి పళ్లంరాజు, రాజా కాకర్లపూడి రాజగోపాల నర్సరాజు, మెండు వీరన్న, మల్లిపూడి పళ్లంరాజు, బలుసు బుచ్చి సర్వారాయుడు, మారిన నరసన్న  వంటి ప్రముఖులూ బోర్డు చైర్మన్‌లుగా వ్యవహరించారు. తర్వాత 1959 సంవత్సరం నుంచి 1986 సంవత్సరం వరకు జిల్లా పరిషత్‌గా  కొనసాగింది. ఈ కాలంలో చైర్మన్‌లుగా తోట రామస్వామి, ఎస్‌బీపీబీకే సత్యనారాయణరావు, పంతం పద్మనాభం, బొడ్డు భాస్కరరామారావు కొనసాగారు. తదనంతరం 1986 సంవత్సరంలో జిల్లా ప్రజా పరిషత్‌గా అప్‌గ్రేడ్‌ కాగా, జీఎంసీ బాలయోగి, గారపాటి గంగాధర రామారావు చౌదరి చైర్మన్‌లుగా పాలన సాగించారు. మధ్యలో ఎమ్మెల్సీ వ్యవస్థ రద్దు కావడంతో కొంతకాలం జిల్లా పరిషత్‌గా వ్యవహరించారు. తిరిగి ఎమ్మెల్సీ వ్యవస్థ పునరుద్ధరించడంతో జిల్లా ప్రజా పరిషత్‌గా మార్పు చెందింది. కాగా కొంతకాలం జిల్లా కలెక్టర్లు ప్రత్యేక అధికారులుగా వ్యవహరించారు. ప్రత్యేక అధి కారులను మినహాయిస్తే 1995 సంవత్సరం నుంచి ఇప్పటివరకు చైర్‌పర్సన్‌లు/చైర్మన్‌లుగా వంగా గీత విశ్వనాథ్‌, గుత్తుల బులిరాజు, దున్నా జనార్దనరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, నామన రాంబాబు, జ్యోతుల నవీన్‌కుమార్‌ కొనసాగగా, ప్రస్తుతం విప్పర్తి వేణుగోపాలరావు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నా రు. ఉమ్మడి తూర్పుగోదావరికి ఆయనే చివరి చైర్మన్‌ కూడా.

Updated Date - 2022-06-25T07:18:47+05:30 IST