పంచాయతీ కార్యదర్శి అరెస్టు

ABN , First Publish Date - 2021-03-06T06:11:47+05:30 IST

యడ్లపాడు మండలం తిమ్మాపురం పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న షేక్‌ సాధిక్‌ ఆలీని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

పంచాయతీ కార్యదర్శి అరెస్టు
కోటలో కబ్జా పేరుతో ఏప్రిల్‌ 2016లో ప్రచురించిన కథనం

యడ్లపాడు, మార్చి 5: యడ్లపాడు మండలం తిమ్మాపురం పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న షేక్‌ సాధిక్‌ ఆలీని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 2016లో కోట పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న సమయంలో సర్పంచ్‌ గౌస్‌ సంధానితో కలసి అక్రమాలకు తెరతీశాడనే ఆరోపణలు ఉన్నాయి. గ్రామ కంఠం పరిధిలో రజకుల దోబీ ఘాట్‌లకోసం కేటాయించిన భూమిని 15గురికి, రెడ్డి రాజుల కాలంనాటి ప్రసన్నాంజనేయస్వామి ఆలయానికి చెందిన భూమిని సత్తెనపల్లికి చెందిన ఓ వ్యక్తికి తప్పుడు ధ్రువీకరణపత్రం జారీ చేశారని ఫిర్యాదులు అందాయి. ఇందుకు సంబంధించి రూ.కోటికి పైగా లావాదేవీలు జరిగినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని ’కోటలో కబ్జా’ పేరుతో ఆంధ్రజ్యోతి వెలుగులోకి తేవడంతో ఉన్నతాధికారులు విచారణ జరిపించి కార్యదర్శిని సస్పెండ్‌ చేశారు. దీనికి తోడు అక్రమ రిజిస్ట్రేషన్‌లు రద్దు చేయాలని, అక్రమాలకు పాల్పడిన కార్యదర్శి, సర్పంచ్‌తోపాటు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వారిపై కేసులు నమోదుచేసి అరెస్ట్‌ చేయాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. అయితే కార్యదర్శి కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకుని విధులలో కొనసాగుతున్నాడు. ఇటీవల కోర్టు ఇచ్చిన స్టే గడువు పూర్తి కావడంతో కార్యదర్శితోపాటు మరో ఏడుగురిపై పోలీసులు కేసు నమోదుచేశారు. సాధిక్‌ ఆలీని గురువారం సాయంత్రం అరెస్ట్‌ చేసిన పోలీసులు శుక్రవారం చిలకలూరిపేట కోర్టులో హాజరు పరచగా 14రోజులు రిమాండ్‌ విధించినట్లు పోలీసులు తెలిపారు. 


Updated Date - 2021-03-06T06:11:47+05:30 IST