హుజూరాబాద్‌లో చకచకా పనులు

ABN , First Publish Date - 2021-06-23T06:24:38+05:30 IST

హుజూరాబాద్‌లో ఉప ఎన్నికల నేపథ్యంలో రోడ్డు పనులు చకచకా జరుగుతున్నాయి.

హుజూరాబాద్‌లో చకచకా పనులు
హుజూరాబాద్‌ అంబేద్కర్‌ చౌరస్తా వద్ద రోడ్డు వేస్తున్న దృశ్యం

- రెండు రోజుల్లో రోడ్డు మరమ్మతులు పూర్తి

- పట్టణాభివృద్ధికి రూ. 35 కోట్ల నిధులు మంజూరు చేసిన మంత్రి గంగుల

హుజూరాబాద్‌, జూన్‌ 22: హుజూరాబాద్‌లో ఉప ఎన్నికల నేపథ్యంలో రోడ్డు పనులు చకచకా జరుగుతున్నాయి. ఎనిమిది నెలల క్రితం పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద గుంతలు ఏర్పడ్డాయి. వాటిని ఎవరూ పట్టించుకోలేదు. ఇంతలో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ రాజీనామా చేశారు. ఇన్‌చార్జి మంత్రి గంగుల కమలాకర్‌ హుజూరాబాద్‌ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు. పట్టణ అభివృద్ధికి 35 కోట్ల నిధులు మంజూరు చేశారు. నిధులు విడుదల కావడంతో పట్టణంలో రెండు రోజుల్లో కొత్త రోడ్డును వేశారు. దీంతో ప్రజలు ఇది ఎన్నికల అభివృద్ధి అంటూ చర్చించుకుంటున్నారు. ఆయా వార్డుల్లో ఉన్న పెండింగ్‌ పనులను గుర్తించాలని మున్సిపల్‌ అధికారులు, ప్రజాప్రతినిధులకు మంత్రి గంగుల సూచించారు. వివిధ వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ, మిషన్‌ భగీరథ పైపులైన్ల పనులను గుర్తించారు. ఈ పనులకు వారం రోజుల్లో టెండర్లు పిలువనున్నారు. పది రోజుల క్రితం ఏడాదిగా పెండింగ్‌లో ఉన్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను మంత్రి గంగుల కమలాకర్‌ చేతుల మీదుగా 260 మంది లబ్ధిదారులకు రూ. 2.6 కోట్ల చెక్కులను అందజేశారు. ఒకవైపు అభివృద్ధి, మరో వైపు సంక్షేమ పథకాలు హుజూరాబాద్‌లో పరుగు పెడుతున్నాయి. గ్రామాలకు కూడా నిధులు రానున్నట్లు తెలిసింది.

Updated Date - 2021-06-23T06:24:38+05:30 IST