పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ
ABN , First Publish Date - 2022-08-09T05:41:58+05:30 IST
భారతీయ తపాల శాఖ కరీంనగర్ డివిజన్ ఆధ్వర్యంలో నగరంలో సోమవారం హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు.
భగత్నగర్, ఆగస్టు 8: భారతీయ తపాల శాఖ కరీంనగర్ డివిజన్ ఆధ్వర్యంలో నగరంలో సోమవారం హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. టవర్ సర్కిల్ ప్రాంతంలోని హెడ్ పోస్టాఫీసు వద్ద తిరంగా ర్యాలీని కరీంనగర్ డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ వై వెంకటేశ్వర్లు ప్రారంభించి మాట్లాడారు. భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత తపాల శాఖ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా పేరిట జాతీయ జెండాలను విక్రయించాలని నిర్ణయించిందన్నారు. అందులో భాగంగా ఆఫ్లైన్, ఆన్లైన్ ద్వారా జాతీయ జెండాలను విక్రయిస్తున్నామన్నారు. ప్రజల్లో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. కరీంనగర్ డివిజన్ పరిధిలో 20 వేలజాతీయ జెండాలను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకొని, ఇప్పటికే పది వేల జాతీయ జెండాలను విక్రయించామన్నారు. ప్రజల నుంచి వచ్చే డిమాండ్ను బట్టి జాతీయ జెండాలను అన్ని పోస్టాఫీసులకు తెప్పిస్తామన్నారు. ప్రతి పోస్టాఫీసులో జాతీయ జెండాలు విక్రయిస్తామని తెలిపారు. జాతీయ జెండాలను సెలవు రోజుల్లో సైతం విక్రయిస్తామన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కరీంనగర్ హెడ్ పోస్టాఫీసు వద్ద ప్రారంభమైన ర్యాలీ, కలెక్టర్ బంగ్లా, ఆర్టీసీ బస్టాండ్, వన్టౌన్ పోలీస్ స్టేషన్, వేంకటేశ్వర ఆలయం, కూరగాయల మార్కెట్, టవర్ సర్కిల్ మీదుగా సాగింది. కార్యక్రమంలో పోస్టల్ ఏఎస్పీ సునీల్, ఐపీవోలు శ్రీనాథ్రెడ్డి, రాజు, మాస్టర్ ఫజల్ రహమాన్, పోస్టల్ ఉద్యోగులు పాల్గొన్నారు.