Trichy: మదినిండా గాంధీయిజం
ABN , First Publish Date - 2022-08-18T16:19:37+05:30 IST
తమిళనాడు తిరుచ్చి ప్రాంతానికి చెందిన కరుపయ్య, చిత్ర గాంధియన్ థాట్స్ (టీజీటీ) ప్రత్యేక కోర్సును మధురైలో అభ్యసించారు. ఇద్దరి భావాలు ఏకం కావడంతో పెళ్లి చేసుకున్నారు. గాంధీ
- సామాజిక సమస్యలపై తమిళ దంపతుల చైతన్యయాత్ర
- వారం రోజుల క్రితం అస్వస్థతతో మృతి చెందిన భార్య
- మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్న భర్త
- శ్రీకాళహస్తి(అమరావతి):
సామాజిక సమస్యలపై తమిళ దంపతుల చైతన్యయాత్ర వారం రోజుల క్రితం అస్వస్థతతో మృతిచెందిన భార్య మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్న భర్త గాంధేయ మార్గం ఆయన మదిలో నాటుకుంది. అలాంటి ఆలోచనలే ఉన్న మహిళ జీవిత భాగస్వామిగా తోడైంది. 22ఏళ్ల పాటు ఇద్దరూ ఎన్నో సామాజిక అంశాలపై ప్రజలకు చైతన్యం కల్పించాలన్న ఆశయంతో పాదయాత్ర చేశారు. సైన్స్, టెక్నాలజీ, పర్యావరణ పరిరక్షణ అంశాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు రెండు నెలలక్రితం తమిళనాడు(Tamil Nadu)లోని మధురై ప్రాంతం నుంచి శ్రీహరికోట(Sriharikota) వరకు యాత్రను చేపట్టారు. ఇక నాలుగు రోజుల్లో యాత్ర ముగుస్తుందన్న సమయంలో భార్య అస్వస్థతతో కళ్లముందే కనుమూసింది. అయినా సమాజ సేవ కోసమే జీవితాన్ని కొనసాగించాలన్న సంకల్పంతో భర్త మరో యాత్రకు శ్రీకారం చుట్టి ముందుకు సాగుతున్నారు.
తమిళనాడు తిరుచ్చి ప్రాంతానికి చెందిన కరుపయ్య, చిత్ర గాంధియన్ థాట్స్ (టీజీటీ) ప్రత్యేక కోర్సును మధురైలో అభ్యసించారు. ఇద్దరి భావాలు ఏకం కావడంతో పెళ్లి చేసుకున్నారు. గాంధీ సిద్ధాంతాలను, ఆలోచనలను ప్రచారం చేస్తూ చిన్న స్టేషనరి దుకాణం నడుపుకుంటూ జీవనం సాగించేవారు. 22 సంవత్సరాల క్రితం పాదయాత్ర ద్వారా దేశంలో పలు ప్రాంతాలకు వెళ్లి సామాజిక అంశాలపై ప్రచారం చేయాలని భావించారు. సుమారు 97 వేల కిలోమీటర్ల యాత్రలో ఎన్నో ప్రశంసలు, మరెందరి దగ్గరో అభినందనలు, సత్కారాలు అందుకుని గాంధీయన్ కపుల్గా గుర్తింపు పొందారు. ఈ యేడాది జూన్ 28వ తేదీన తిరుచ్చి ప్రాంతం వైఎంపట్టి ప్రాంతం నుంచి శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం వరకు చేరుకునేలా యాత్రను ప్రారంభించారు. ఆగస్టు 15వ తేదీన యాత్ర ముగించి స్వాతంత్య్ర దినోత్సవాలకు హాజరు కావాలని భావించారు. అయితే 11వ తేదీన సూళ్లూరుపేటలో వెళుతుండగా చిత్ర అస్వస్థతతో తనువు చాలించింది. భార్య మృతదేహాన్ని సూళ్లూరుపేట(Sullurpet)లోనే ఖననం చేసిన దుఃఖభారంతోనే ముందుకు సాగిన కరుపయ్య షార్లో సోమవారం జరిగిన స్వాతంత్య్ర దిన వేడుకల్లో యాత్రను ముగించారు.
మరో యాత్రకు శ్రీకారం
శ్రీహరికోట నుంచి బెంగళూరులోని ఇస్రో హెడ్క్వార్టర్స్కు ఆజాదీ కా అమృత్ వారోత్సవాలపై మరో యాత్రకు కరుపన్ శ్రీకారం చుట్టారు.ఒంటరిగా నడవలేక ఓ దాత ఇచ్చిన సైకిల్తో యాత్ర ప్రారంభించారు.రెండు రోజులుగా జ్వరంతో ఉన్నప్పటికీ మంగళవారం యాత్రను ప్రారంభించిన కరుపయ్య సాయంత్రం చీకటిపడే సమయానికి శ్రీకాళహస్తికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతి ప్రతినిధితో మాట్లాడుతూ గాంధీ సిద్ధాంతాలు భావితరాలకు చాలా అవసరమన్నారు. ఆ ఆలోచనతోనే 22ఏళ్ల పాటు గాంధీ మార్గంతో పాటు ఎన్నో సామాజిక కార్యక్రమాలపై ప్రచారం చేసినట్లు వెల్లడించారు.