Umbrella trip: తిరుమలకు పవిత్ర గొడుగుల యాత్ర

ABN , First Publish Date - 2022-09-30T16:11:14+05:30 IST

తిరుమలలో జరుగుతున్న సాలకట్ల బ్రహ్మోత్సవాల(Brahmotsavams)లో ప్రధానాంశమైన గరుడోత్సవం రోజున సమర్పించేందుకు

Umbrella trip: తిరుమలకు పవిత్ర గొడుగుల యాత్ర

                        - ప్రారంభించిన న్యాయాధికారి ఎళిల్‌వేలన్‌


ప్యారీస్‌(చెన్నై), సెప్టెంబరు 29: తిరుమలలో జరుగుతున్న సాలకట్ల బ్రహ్మోత్సవాల(Brahmotsavams)లో ప్రధానాంశమైన గరుడోత్సవం రోజున సమర్పించేందుకు తిరుపతి అంబ్రిల్లా ఛారిటీస్‌ (టీయూసీ) తరఫున ప్రత్యేకంగా తయారు చేయించిన గొడుగుల ఊరేగింపు నేత్రపర్వంగా సాగింది. స్థానిక జార్జిటౌన్‌ కందప్ప వీధిలోని టీయూసీ కార్యాలయ ప్రాంగణంలో బుధవారం రాత్రి ట్రస్టీ శీలం వరదరాజులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా న్యాయాధికారి ఎళిల్‌వేలన్‌ పాల్గొని ఊరేగింపును ప్రారంభించారు. మద్రాసు హైకోర్టు రిటైర్జ్‌ న్యాయమూర్తులు ఎం. గోవిందరాజన్‌, ఇ. పద్మనాభన్‌, ఐఏఎస్‌ అధికారి సి.రాజేంద్రన్‌ విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. భక్తుల గోవింద నామస్మరణ, మేళతాళాల మధ్య ఈ ఊరేగింపు ఆదియప్పన్‌ వీధి, బందరు వీధి, నేతాజీ సుభాస్‌ చంద్రబోస్‌ రోడ్డు, గోవిందప్పనాయకన్‌ వీధి, ఆచారప్పన్‌ వీధి, వరదాముత్తయ్య వీధుల మీదుగా సాగి మళ్లీ టీయూసీ కార్యాలయానికి చేరుకుంది. అనంతరం రాత్రి 10.30 గంటలకు ప్రత్యేక వాహనం ద్వారా 11 పవిత్ర గొడుగులతో తిరుచానూరుకు బయల్దేరి వెళ్లారు. శుక్రవారం ఉదయం అక్కడి నుంచి కాలినడకగా బయలుదేరి తిరుమల కొండపైకి చేర్చి అక్టోబరు 1న టీటీడీ అధికారులకు గొడుగులను సమర్పిస్తారు. ప్రతిష్ఠాత్మకమైన శ్రీవారి గరుడ సేవలో అలంకరించేందుకు వంశపారంపర్యంగా గొడుగులు సమర్పించే కైంకర్యం 185 ఏళ్లుగా కొనసాగుతోందని, ఇది తమ వంశీయులకు కలిగిన అదృష్టంగా భావిస్తున్నట్లు వరదరాజన్‌ తెలిపారు.

Updated Date - 2022-09-30T16:11:14+05:30 IST