తిరుపతి@ 5 స్టార్
ABN , First Publish Date - 2022-09-25T06:38:43+05:30 IST
స్వచ్ఛ సర్వేక్షణలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కు 5 స్టార్ రేటింగ్ దక్కింది.ఇప్పటివరకు 3 స్టార్ రేటింగ్కు మాత్రమే పరిమితమైన తిరుపతి కార్పొరేషన్ 5 స్టార్కు తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది.
స్వచ్ఛ సర్వేక్షణ్లో మెరుగుపడ్డ రేటింగ్
1న అవార్డు అందజేయనున్న రాష్ట్రపతి
తిరుపతి, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): స్వచ్ఛ సర్వేక్షణలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కు 5 స్టార్ రేటింగ్ దక్కింది.ఇప్పటివరకు 3 స్టార్ రేటింగ్కు మాత్రమే పరిమితమైన తిరుపతి కార్పొరేషన్ 5 స్టార్కు తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. అక్టోబరు 1న రాష్ట్రపతి చేతుల మీదుగా స్వచ్ఛ అవార్డును కార్పొరేషన్ యంత్రాంగం అందుకోనుంది. ఈ నేపథ్యంలో శనివారం కార్పొరేషన్ కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా పరిశుభ్రతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్ను ప్రవేశపెట్టింది. చక్కటి పారిశుధ్యం, బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జనల నిషేధం అమలు, పబ్లిక్ టాయిలెట్ల వినియోగం, వాటి నిర్వహణ-పనితీరు, సీనియర్ సిటిజన్స్ ఫీడ్బ్యాక్, డాక్యుమెంటేషన్, చెత్త సద్వినియోగం తదితర అంశాలను పోటీలో ప్రామాణికంగా తీసుకుంటారు. ఈక్రమంలో పరిశీలన బృందం మూడు నెలల ముందు తిరుపతిని సందర్శించింది. స్వచ్ఛ సర్వేక్షణ్లోని ప్రామాణికాలను పాటించినందుకు గాను తిరుపతికి 5స్టార్ రేటింగ్ ఇచ్చింది.ప్రతిష్టాత్మక ప్రెసిడెన్షియల్ అవార్డుకు తిరుపతి నగర పాలకసంస్థ ఎన్నికవడం అభినందనీయమని ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి, మేయర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలి సంతోషం వ్యక్తం చేశారు. మున్సిపల్ సిబ్బంది, ప్రజల సమష్టి కృషితోనే ఇది సాధ్యమైనట్టు తెలిపారు.కార్యాలయ ఆవరణంలో శనివారం కేక్ కట్చేసి ఇంజనీరింగ్, పారిశుధ్య కార్మికులను ఘనంగా సత్కరించారు.డిప్యూటీ మేయరు ముద్రనారాయణ, కార్పొరేటర్లు, ఏడీసీ సునీత, డీసీ చంద్రమౌళీశ్వర రెడ్డి, ఎస్ఈ మోహన్, ఎంహెచ్వో డాక్టర్ హరికృష్ణ, ఎంఈలు చంద్రశేఖర్, వెంకటరామిరెడ్డి, డీఈ విజయకుమార్ రెడ్డి, ఆర్వో సేతుమాధవ్, మేనేజరు చిట్టిబాబు, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య, సుమతి తదితరులు పాల్గొన్నారు.