Anubrata Mondal Arrest Updates: మరో కీలక నేత ఫోన్ కాల్స్‌‌కూ స్పందించని మమత

ABN , First Publish Date - 2022-08-12T22:54:28+05:30 IST

కోల్‌కతా: తృణమూల్‌ కాంగ్రెస్ (Trinamool Congress) అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Chief Minister Mamata Banerjee) మరో కీలక నేత ఫోన్ ఎత్తడం మానేశారు.

Anubrata Mondal Arrest Updates: మరో కీలక నేత ఫోన్ కాల్స్‌‌కూ స్పందించని మమత

కోల్‌కతా: తృణమూల్‌ కాంగ్రెస్ (Trinamool Congress) అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Chief Minister Mamata Banerjee) మరో కీలక నేత ఫోన్ ఎత్తడం మానేశారు. పశువుల స్మగ్లింగ్‌ కేసులో సీబీఐ (CBI) అరెస్ట్ చేసిన అనుబ్రత మండల్‌ (Anubrata Mondal) ఫోన్ చేసినా దీదీ కనికరించలేదని సమాచారం. ఎస్ఎస్‌సీ రిక్రూట్ స్కామ్‌ (SSC recruitment scam)లో నోట్ల కట్టలతో ఈడీకి అడ్డంగా దొరికిపోయిన పార్థా చటర్జీ (Partha Chatterjee) ఫోన్ కాల్స్‌కి కూడా దీదీ ఇటీవల స్పందించలేదు. ఇప్పుడు అనుబ్రత మండల్‌ విషయంలోనూ దీదీ అదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. అవినీతికి పాల్పడే వారిని క్షమించే ప్రసక్తే లేదని మమత చెప్పారు. అవినీతి సొమ్ముతో తమ పార్టీకి కానీ, ప్రభుత్వానికి గానీ ఎలాంటి సంబంధమూ లేదని టీఎంసీ నేతలంటున్నారు. అయితే బలమైన నేతలు వరుసబెట్టి అరెస్ట్ అవుతుండటం తృణమూల్ కాంగ్రెస్ వర్గాలను ఆత్మరక్షణలో పడేశాయి. 


పశువుల స్మగ్లింగ్‌ కేసులో ప్రత్యక్ష సంబంధం ఉండటంతో సీబీఐ రెండు సార్లు విచారణకు పిలిచినా రాకపోవడంతో నేరుగా అనుబ్రత మండల్‌ ఇంటికి వెళ్లి అరెస్టు చేశారు. అసన్‌సోల్‌లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు పది రోజుల రిమాండ్‌ విధించింది. ఆగస్టు 20 వరకు జైలులో ఉంటారని, బెయిల్‌ కోసం ఎలాంటి దరఖాస్తు చేయడం లేదని ఆయన తరఫు న్యాయవాది చెప్పారు. అనారోగ్యం దృష్ట్యా మండల్‌కు 14 రోజుల పాటు బెడ్‌రెస్ట్‌ అవసరమంటూ ధ్రువపత్రం ఇచ్చిన బోల్‌పూర్‌ ఆస్పత్రి డాక్టరునూ విచారిస్తామని అధికారులు తెలిపారు. ఈ కేసులో అనుబ్రత మండల్‌ బాడీ గార్డు సెగల్‌ హుస్సేన్‌నూ సీబీఐ అరెస్టు చేసింది. కాగా, బొగ్గు స్కాం కేసులో విచారణకు హాజరు కావాలంటూ బెంగాల్‌ 8 మంది సీనియర్‌ ఐపీఎస్‌లకు ఈడీ నోటీసులు పంపించింది. ఢిల్లీలోని ఆఫీసుకి రావాలంటూ వేర్వేరు తేదీలను కేటాయించింది. 





రాబోయే కొద్ది రోజుల్లో అవినీతి కేసులతో సంబంధమున్న నేతల అరెస్టులు తప్పవని పశ్చిమబెంగాల్‌లో ప్రచారం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ సంస్థల పేర్లు చెబితేనే టీఎంసీ వర్గాలు ఉలిక్కి పడుతున్నాయని బీజేపీ నేతలంటున్నారు. పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిన టీఎంసీ నేతలకు ఇక జైళ్లే గతి అని వారు హెచ్చరిస్తున్నారు. అయితే ఈడీ, ఐటీ, సీబీఐ పేరుతో కేంద్రం తమ పార్టీ నేతలను టార్గెట్ చేస్తోందని టీఎంసీ వర్గాలు బలంగా విమర్శించలేకపోతున్నాయి. ఆధారాలతో, నోట్ల కట్టలతో సహా దొరికిపోతుండటంతో టీఎంసీ వర్గాలు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి. 

Updated Date - 2022-08-12T22:54:28+05:30 IST