Amit Shah అపాయింట్మెంట్ దొరకలేదని కార్యాలయం బయటే..
ABN , First Publish Date - 2021-11-22T23:28:24+05:30 IST
త్రిపురలో నవంబర్ 25న స్థానిక సంస్థల ఎన్నికలున్న సందర్భంగా ఆదివారం తృణమూల్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అయితే బీజేపీ నేతలపై దాడి చేశారంటూ త్రిపుర తృణమూల్ యూత్ కాంగ్రెస్ అధినేత సాయని ఘోష్ను..
న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసేందుకు అపాయింట్మెంట్ లభించలేదని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు ఢిల్లీలోని హోం మంత్రిత్వ శాఖ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. ఆదివారం త్రిపురలో జరిగిన సంఘటనల నిమిత్తం కేంద్ర హోంమంత్రిని కలిసి చర్చించాలని టీఎంసీ నేతలు అపాయింట్మెంట్ కోరారు. అయితే వారికి అపాయింట్మెంట్ లభించకపోవడంతో సోమవారం నిరసన చేపట్టారు.
యూత్ ప్రెసిడెంట్ సాయోని ఘోష్ అరెస్ట్
త్రిపురలో నవంబర్ 25న స్థానిక సంస్థల ఎన్నికలున్న సందర్భంగా ఆదివారం తృణమూల్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అయితే బీజేపీ నేతలపై దాడి చేశారంటూ త్రిపుర తృణమూల్ యూత్ కాంగ్రెస్ అధినేత సాయని ఘోష్ను అరెస్ట్ చేశారు. ఆమెపై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. దీనిని టీఎంసీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ విషయమై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కలిసి చర్చించాలని నిర్ణయించారు. అందుకు గాను అమిత్ షా అపాయింట్మెంట్ కోరగా.. తిరస్కరించారు.
‘‘మేము పలుమార్లు హోంమంత్రి కార్యాలయానికి ఫోన్ చేశాము. అపాయింట్మెంట్ కావాలని కోరాం. కానీ మాకు అపాయింట్మెంట్ లభించలేదు. అందుకే కేంద్ర హోంశాఖ కార్యాలయం ముందే నిరసన చేపట్టాలని నిర్ణయించాం’’ అని టీఎంసీ నేత, ఎంపీ కల్యాణ్ బెనర్జీ అన్నారు.