టీఎంసీ అసలు రేసులోనే లేదు: కేజ్రీవాల్

ABN , First Publish Date - 2021-12-22T18:37:26+05:30 IST

తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీని 'పెద్దక్క'గా ఇటీవల..

టీఎంసీ అసలు రేసులోనే లేదు: కేజ్రీవాల్

పనజి: తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీని 'పెద్దక్క'గా ఇటీవల అభివర్ణించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తాజాగా ఆ పార్టీ అసలు రేసులోనే లేదంటూ వ్యాఖ్యానించారు. గోవాలో ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన కేజ్రీవాల్ బుధవారంనాడు మీడియాతో మాట్లాడుతూ, టీఎంసీకి మీరు (మీడియా) ప్రాధాన్యం ఇస్తుండొచ్చేమో కానీ అసలు ఆ పార్టీ ఆనవాళ్లు గోవాలో ఎక్కడా లేవని అన్నారు.


''బహుశా మీరు టీఎంసీకి ప్రాధాన్యం ఇస్తుండొచ్చు. ప్రస్తుతానికైతే టీఎంసీకి ఒక్క శాతం ఓటింగ్ షేర్ కూడా లేదు. మూడు నెలల క్రితమే ఆ పార్టీ గోవాలో అడుగుపెట్టింది. ప్రజాస్వామ్యం అంటే అలాగ ఉండదు. కష్టపడి పనిచేయాలి, ప్రజల కోసం పనిచేయాలి'' అని కేజ్రీవాల్ అన్నారు. ఆసక్తికరంగా, కొద్ది వారాల క్రితమే ఆయన మమతా బెనర్జీని 'పెద్దక్క'గా పేర్కొన్నారు. ఎన్నికల్లో ఆమె తనపై పోరాటం చేసినా, చెంపదెబ్బ కొట్టినా ఆమెను గౌరవించడం మాననని, విపక్ష పార్టీలకు ఎవరు నాయకత్వం వహిస్తారనేది ప్రశ్న కాదని, అంతిమంగా దేశానికి ప్రయోజనం చేకూరాలని అన్నారు. మమతా బెనర్జీ జూలై 28న ఢిల్లీ వచ్చినప్పుడు కేజ్రీవాల్‌తో సమావేశమయ్యారు. కేజ్రీవాల్ సైతం గత జనవరిలో గోవా ఎన్నికల్లో ఆప్ పోటీ చేస్తుందని, మమతా బెనర్జీ ప్లాన్స్ ఏమిటో సెప్టెంబర్‌లో ఆమె ప్రకటిస్తారని అన్నారు.

Updated Date - 2021-12-22T18:37:26+05:30 IST