GK Vasan: డీఎంకే రెండు నాల్కల ధోరణి
ABN , First Publish Date - 2022-09-20T15:28:03+05:30 IST
ప్రతిపక్షంలో ఒక మాట, అధికారంలో మరో మాట అంటూ డీఎంకే రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తోందని తమిళ మానిల కాంగ్రెస్ (టీఎంసీ) అధ్యక్షుడు జీకే వాసన్(GK Vasan)
- టీఎంసీ అధ్యక్షుడు జీకే వాసన్
చెన్నై: ప్రతిపక్షంలో ఒక మాట, అధికారంలో మరో మాట అంటూ డీఎంకే రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తోందని తమిళ మానిల కాంగ్రెస్ (టీఎంసీ) అధ్యక్షుడు జీకే వాసన్(GK Vasan) దుయ్యబట్టారు. విద్యుత్ ఛార్జీల పెంపుదలను నిరసిస్తూ ఆ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం సేలం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జీకే వాసన్ మాట్లాడుతూ, ఎన్నో హామీలతో అధికారం చేపట్టిన డీఎంకే(DMK) తమకు మేలు చేస్తోందని ఆశించిన ప్రజలకు నిరాశ ఎదురైందన్నారు. ఆస్తి, తాగునీటి పన్ను, పాల ధరల పెంపు, తాజాగా విద్యుత్ చార్జీలు పెంచి అన్నివర్గాలపై డీఎంకే ప్రభుత్వం భారం మోపిందన్నారు. గత అన్నాడీఎంకే హయాంలో చార్జీలు పెంచిన సమయంలో భారీ ఆందోళనలు చేపట్టిన డీఎంకే, అధికారం చేపట్టాక పెంచుతున్న చార్జీలపై ఏం సమాధానం చెపుతోందని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించి ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనలతో జీవిస్తున్నారని అన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో డీఎంకేకు తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని జీకే వాసన్ తెలిపారు.