ఆస్తి పన్ను తగ్గించాల్సిందే
ABN , First Publish Date - 2022-04-12T15:19:47+05:30 IST
అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో డీఎంకే ప్రకటించిన హామీ మేరకు ఆస్తి పన్ను తగ్గించాలని తమిళ మానిల కాంగ్రెస్ (టీఎంసీ) అధ్యక్షుడు జీకే వాసన్ డిమాండ్ చేశారు. హార్బర్
- నిరసన ప్రదర్శనలో జీకే వాసన్
ప్యారీస్(చెన్నై): అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో డీఎంకే ప్రకటించిన హామీ మేరకు ఆస్తి పన్ను తగ్గించాలని తమిళ మానిల కాంగ్రెస్ (టీఎంసీ) అధ్యక్షుడు జీకే వాసన్ డిమాండ్ చేశారు. హార్బర్ నియోజకవర్గం కలెక్టర్ కార్యాలయ సమీపంలో టీఎంసీ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన నిరసన ప్రదర్శనను ఆ పార్టీ అధ్యక్షుడు జీకే వాసన్ ప్రారంభించారు. పార్టీ ప్రధాన నిర్వాహకులు వీబీ జవహర్బాబు, ఈకే అరుణ్కుమార్, బిజూ చాకో, మాజీ ఎమ్మెల్యే విడియల్ శేఖర్ సహా వందలాది మంది కార్యకర్తలు ఈ ఆందోళనలో పాల్గొని రాష్ట్రప్రభుత్వానికి తమ నిరసన తెలిపారు. నిరసన కార్యక్రమంలో జీకే వాసన్ మాట్లాడుతూ, కరోనా ప్రభావంతో రెండేళ్లుగా ఉపాధికిలేక రాష్ట్రప్రజలు ఆర్ధిక సమస్యలతో నలుగుతున్నారని, మళ్లీ కరోనా వ్యాపించే అవకాశముందని భీతిల్లుతున్న ప్రజలపై మరింత ఆర్ధికభారం మోపేలా ఆస్తి పన్ను పెంచడం సరికాదన్నారు. ఆస్తి పన్ను పెంపును ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమాల్లో ప్రజలు స్వచ్ఛంధంగా పాల్గొంటున్నారని, అయినప్పటికీ పాలకులు దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని జీకే వాసన్ ఆరోపించారు.