Dmk తప్పు చేసినా నిలదీస్తాం..
ABN , First Publish Date - 2022-06-12T13:26:45+05:30 IST
కూటమిలో ఉంటూనే అధికార డీఎంకే చేపట్టిన సంక్షేమ పథకాలను స్వాగతించడంతో పాటు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తే నిలదీస్తామని
- జైళ్లలో ఉన్న ముస్లింలనూ విడుదల చేయాల్సిందే
- రాజీవ్ హంతకులను రిలీజ్ చేయగా లేంది వారినెందుకు విడుదల చేయకూడదు?
- టీఎన్సీసీ అధ్యక్షుడు అళగిరి
పెరంబూర్(చెన్నై), జూన్ 11: కూటమిలో ఉంటూనే అధికార డీఎంకే చేపట్టిన సంక్షేమ పథకాలను స్వాగతించడంతో పాటు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తే నిలదీస్తామని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్సీసీ) అధ్యక్షుడు కేఎస్ అళగిరి తెలిపారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన ప్రకటనలో... ఏడాది పాలనలో డీఎంకే ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెట్టే చర్యలకు పాల్పడలేదన్నారు. అదే సమయంలో ఆస్తి పన్ను పెంపును వ్యతిరేకించామని, ఏడాదికి 10 శాతం మాత్రం పెంచాలని ప్రభుత్వానికి సూచించామన్నారు. రాజీవ్ హత్యకేసులో పేరరివాలన్ విడుదలను తాము స్వాగతించలేదని, అదే సమయంలో ఆ నిర్ణయాన్ని ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 700 ప్రాంతాల్లో ఆందోళనలు చేపట్టామని తెలిపారు. రాజీవ్ కేసులో మిగిలిన ఆరుగురు విడుదల కావచ్చన్నారు. అదే జరిగితే తీవ్రవాద కార్యకలాపాలా ఆరోపణల కింద అరెస్టయి, కోవై జైలులో ఉన్న ముస్లింలను కూడా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాజీవ్ హంతకులను విడుదల చేయగా, వారిని మాత్రం ఎందుకు విడుదల చేయకూడదని ప్రశ్నించారు. కార్యకర్త అభిప్రాయాలకే పార్టీలో పెద్దపీట వేస్తామని అళగిరి తెలిపారు.