Alagiri statement: దేశభక్తిపై బీజేపీ కపట నాటకం

ABN , First Publish Date - 2022-08-02T13:52:46+05:30 IST

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశభక్తిపై కపటనాటకాలాడుతోందని టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి(TNCC President KS

Alagiri statement: దేశభక్తిపై బీజేపీ కపట నాటకం

                                  - టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి 


చెన్నై, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశభక్తిపై కపటనాటకాలాడుతోందని టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి(TNCC President KS Alagiri) ధ్వజమెత్తారు. బీజేపీకి, స్వాతంత్య్రదినోత్సవానికి ఎలాంటి సంబంధం లేదని, ఆ పార్టీకి చెందినవారంతా ఏళ్లతరబడి జాతీయ జెండాలను ఆవిష్కరించేందుకు కూడా ఇష్టపడలేదన్న విషయం దేశ ప్రజలందరికీ తెలిసిందేనన్నారు. 75వ స్వాతంత్య్రదినోత్సవాన్ని అమృతోత్సవాల పేరిట ఘనంగా జరపాలంటూ కేంద్రంలోని బీజేపీ( BJP) పాలకులు పిలుపునివ్వడం కూడా హాస్యాస్పదంగా ఉందన్నారు. స్వాతంత్య్రం అంటేనే దేశ ప్రజలందరికీ జాతీయ కాంగ్రెస్‌ పార్టీయే గుర్తుకువస్తుందని, ఎంతోమంది కాంగ్రెస్‌ నాయకులు స్వాతంత్యం కోసం ప్రాణ త్యాగాలు చేశారని, జైలుపాలయ్యారని వీరందరినీ స్మరించుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని అళగిరి అన్నారు. స్థానిక రాయపేట(Rayapeta)లోని సత్యమూర్తి భవన్‌లో స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి చర్చించే నిమిత్తం అళగిరి(Alagiri) అధ్యక్షతన పార్టీ ప్రముఖుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి శ్రీవల్ల ప్రసాద్‌, టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షుడు ఈవీకేఎస్‌ ఇలంగోవన్‌, ప్రధాన కార్యదర్శి చిరంజీవి, పార్టీ ప్రముఖులు రూబీ మనోహరన్‌, రంగభాష్యం, ఇల భాస్కరన్‌, నాంజిల్‌ సంపత్‌, ఎంఎస్‌ కలంజియం, శివరాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల తొమ్మిది నుంచి 15 వరకు జిల్లాలవారీగా 75 కి.మీ. వరకూ పాదయాత్రలు నిర్వహించాలని ఈ సమావేశంలో తీర్మానించారు. క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని తలపించేలా ఈ పాదయాత్రలను ఘనంగా నిర్వహించేందుకు పార్టీ జిల్లా శాఖ నాయకులు భారీగా ఏర్పాట్లు చేపట్టాలని అళగిరి విజ్ఞప్తి చేశారు. ఇదే విధంగా ప్రజా సమస్యలపై కాంగ్రెస్‌ నిర్వహించే ఆందోళనలకు అడ్డుకట్ట వేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఖండిస్తూ ఈ నెల 5న పార్టీ ఆధ్వర్యంలో రాజ్‌భవన్‌ ముట్టడి ఆందోళన నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.


సర్వసభ్యమండలి సభ్యత్వానికి పోటాపోటీ

టీఎన్‌సీసీ సర్వసభ్యమండలి సభ్యత్వ పదవులకు కాంగ్రెస్‌ పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. 688 మంది సభ్యులను ఎంపిక చేయాల్సి ఉండగా ఆ పదవులకు పార్టీ నేతల సిఫారసు లేఖలతో రెండువేలమందికిపైగా దరఖాస్తులు చేయడంతో వారిలో ఎవరిని ఎంపిక చేయాలో తెలియక పార్టీ నేతలు సతమతమవుతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ సంస్థాగత ఎన్నికలు కొద్ది నెలల ముందు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం రాష్ట్ర సర్వసభ్యమండలి సభ్యులు, ఏఐసీసీ సభ్యుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. 688 మందిని సర్వసభ్య మండలి సభ్యులుగా నియమించిన తర్వాత ప్రతి ఎనిమిదిమంది సర్వసభ్యమండలి సభ్యుల ప్రతిపాదనతో ఏఐసీసీ సభ్యులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఆ మేరకు రాష్ట్రం నుంచి 86 మందిని ఏఐసీసీ సభ్యులను ఎంపిక చేసుకునే వీలుంది. అయితే సర్వసభ్యమండలి సభ్యత్వ పదవికి పార్టీ నేత అళగిరి మద్దతుదారులు, మాజీ నేతలు ఈవీఎకేఎస్‌ ఇలంగోవన్‌, ఎస్‌.తిరునావక్కరసర్‌, పార్టీ ప్రముఖులు సుదర్శన్‌ నాచ్చియప్పన్‌, ఎంపీలు, ఎమ్మెల్యేలు(MPs and MLAs) ఆ పదవులను తమ అనుచరులకు దక్కించుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఎన్‌సీసీ సర్వసభ్యమండలి సభ్యులను ఎంపిక చేసే విషయంగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిలు దినేశ్‌ గుండూరావు, శ్రీవల్ల ప్రసాద్‌, తరుణ్‌గోగాయ్‌ బెంగళూరులో తీవ్రంగా చర్చలు జరుపుతున్నారు. ఈ నెలాఖరులోగా సర్వసభ్యమండలి సభ్యులను నియమించేందుకు చర్యలు చేపడుతున్నారు.

Updated Date - 2022-08-02T13:52:46+05:30 IST