సీతారాముల కల్యాణానికి సర్వం సిద్ధం
ABN , First Publish Date - 2021-04-21T05:41:28+05:30 IST
నంద్యాలలోని సంజీవనగర్, నందమూరినగర్, కోటా వీధిలోని రామాలయాల్లో సీతారాముల కల్యాణానికి నిర్వాహకులు సర్వం సిద్ధం చేశారు.
నంద్యాల(కల్చరల్), ఏప్రిల్ 20: నంద్యాలలోని సంజీవనగర్, నందమూరినగర్, కోటా వీధిలోని రామాలయాల్లో సీతారాముల కల్యాణానికి నిర్వాహకులు సర్వం సిద్ధం చేశారు. బుధవారం ఉదయం 10 గంటలకు సంజీవనగర్ రామాలయంలో సీతారాముల కల్యాణం, ఒంటి గంటకు సీతమ్మవారికి వడిబియ్యం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు భగవత్ సేవాసమాజ్ కమిటీ అధ్యక్షుడు సముద్రాల సూరయ్య తెలిపారు. కొవిడ్ను దృష్టిలో ఉంచుకొని ముందుస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.
సుగంధ డ్రైఫ్రూట్స్ మాలలు : నంద్యాల సంజీవనగర్ కోదండ రామాలయంలో జరిగే సీతారాముల కల్యాణానికి జిల్లా విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు విష్ణువర్దన్ రెడ్డి స్వాములవారికి సుగంధ డ్రైఫ్రూట్స్ మాలలు సమర్పించారు. ఈ సందర్భంగా భగవత్ సేవా సమాజ్ కమిటీ వీరిని సన్మానించారు.
రుద్రవరం: మండలంలోని టి.లింగందిన్నె సమీపంలోని భజనపల్లె, డి.కొట్టాల, రుద్రవరంలో సీతారాముల కల్యాణానికి ఏర్పాట్లు పూర్తయినట్లు నిర్వాహకులు తెలిపారు. బుధవారం శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యా ణం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
చాగలమర్రి: చాగలమర్రి గ్రామంలోని పట్టాభిరామ, కోదండరామ, వీరాంజనేయస్వామి ఆలయాల్లో బుధవారం నుంచి మూడు రోజులపాటు శ్రీరామనవమి వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. 21న సీతారాముల కల్యాణం, 22న సీతారాముల పల్లకి ఉత్సవం జరుగుతాయన్నారు.