ఇంద్రకీలాద్రి ఇక టొబాకో ఫ్రీజోన్
ABN , First Publish Date - 2022-06-26T05:42:01+05:30 IST
ఇంద్రకీలాద్రి ఇక టొబాకో ఫ్రీజోన్
కలెక్టర్, ఈవో, డీఎంఅండ్హెచ్వో డిక్లరేషన్
అతిక్రమించిన వారికి రూ.200 జరిమానా
(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : ఇంద్రకీలాద్రి టొబాకో ఫ్రీజోన్ జాబితాలోకి వెళ్లింది. ఇక నుంచి ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉద్యోగులు కానీ, ఇతరులు కానీ ధూమపానం చేయకూడదు. దీంతోపాటు పొగాకు ఉత్పత్తులను ఉపయోగించకూడదు. ప్రస్తుతం ఈ జాబితాలో రాష్ట్రంలో తిరుమల మాత్రమే ఉంది. తాజాగా ఇంద్రకీలాద్రి చేరింది. టొబాకో ఫ్రీజోన్కు సంబంధించిన డిక్లరేషన్ శనివారం నుంచి అమల్లోకి వచ్చింది. కలెక్టర్ కార్యాలయంలో శనివారం జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ దిల్లీరావు, దుర్గగుడి ఈవో భ్రమరాంబ, జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి సుహాసినీ ఈ డిక్లరేషన్పై సంతకాలు చేశారు. దీని ప్రకారం ఇకపై పొగాకు ఉత్పత్తులను కలిగి ఉన్న భక్తులను కొండపైకి అనుమతించరు. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే రూ.200 జరిమానా విధిస్తారు. తిరుపతిలో అలిపిరి టోల్గేట్ వద్ద ఉన్న చెక్పోస్టులో కొండపైకి వెళ్లే వాహనాలను తనిఖీ చేస్తారు. మండే వస్తువులు, పొగాకు ఉత్పత్తులు సిగరెట్, బీడీ, గుట్కా, ఖైనీ వంటివి ఉంటే సీజ్ చేస్తారు. ఇక నుంచి ఇంద్రకీలాద్రిపైనా ఇలాగే తనిఖీలు ఉంటాయి. లిఫ్టు, మెట్ల మార్గాల వైపు నుంచి వెళ్లే వారిని భద్రతా సిబ్బంది పూర్తిస్థాయిలో తనిఖీ చేశాక పైకి పంపుతారు. అలాగే, కొండపైకి వెళ్లే వాహనాలను టోల్గేట్ వద్ద సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. ఎలాంటి పొగాకు ఉత్పత్తులు ఉన్నా వెనక్కి పంపిస్తారు.