పరీక్షలకు వేళాయే...!
ABN , First Publish Date - 2022-05-05T13:19:37+05:30 IST
రాష్ట్ర పాఠ్య ప్రణాళికలో చదువుతున్న విద్యార్థులకు వార్షిక పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ప్లస్ టూ గురువారం నుంచి, టెన్త్ పరీక్షలు 6న, ప్లస్ వన్ పబ్లిక్ పరీక్షలు 10వ
- నేటినుంచి ప్లస్ టూ, రేపటి నుంచి టెన్త్
- కేంద్రాలకు ఉదయం 9 గంటలకు చేరుకోవాలి
పెరంబూర్(చెన్నై): రాష్ట్ర పాఠ్య ప్రణాళికలో చదువుతున్న విద్యార్థులకు వార్షిక పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ప్లస్ టూ గురువారం నుంచి, టెన్త్ పరీక్షలు 6న, ప్లస్ వన్ పబ్లిక్ పరీక్షలు 10వ తేది నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. గురువారం నుంచి ప్రారంభం కానున్న ప్లస్ టూ పబ్లిక్ పరీక్షలకు 3,119 కేంద్రాలు ఏర్పాటుచేయగా, 8,.37,317 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, జనరేటర్ సౌకర్యం, అత్యవసర వైద్యచికిత్స శిబిరాలు ఏర్పాటు చేశారు.. ప్లస్ టూ పరీక్షలు ఉదయం 10 గంటలకు ప్రారంభమై మధ్యా హ్నం 1.15 గంట వరకు జరుగుతాయి. విద్యార్థులు 9 గంటలకే తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని పరీక్షల విభాగం డైరక్టరేట్ ఇప్పటికే సూచించింది. 9.45 గంటలకు పరీక్ష గదిలోకి అనుమతిస్తారు. 10 నుంచి 10.10 గంటల వరకు విద్యార్థులు ప్రశ్నాపత్రం చదువుకొనేందుకు సమయం కేటాయించారు. 10.15 నుంచి మధ్యాహ్నం 1.15 గంట వరకు పరీక్ష జరుగనుంది.
విద్యార్థులకు సీఎం శుభాకాంక్షలు...
పబ్లిక్ పరీక్షలు రాయనున్న విద్యార్థినీ, విద్యార్థులకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సీఎం తన ట్విట్టర్లో... ‘‘గురువారం ప్లస్ టూ, శుక్రవారం నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు శుభాకాంక్షలు. మీరు నేర్చుకున్నది ఎంతో అంచనా వేయడానికే ఈ పరీక్షలు, మీ ప్రతిభకు కొలమానం కాదు. ఆత్మవిశ్వాసంతో పరీక్షలు ఎదుర్కొని విజేతలు కండి’’ అంటూ ఆశీస్సులందజేశారు. అలాగే పలు పార్టీల నేతలు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రకటనలు విడుదల చేశారు.
పరీక్ష రోజే పాఠశాలకు రావాలి : మంత్రి అన్బిల్ మహేష్
రాష్ట్రవ్యాప్తంగా 1-9 తరగతుల విద్యార్థులు గురువారం నుంచి పాఠశాలకు రానవసరం లేదని, పరీక్షల రోజు మాత్రం వస్తే చాలని పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ తెలిపారు.