నేడు గవరపాలెం గౌరీపరమేశ్వరుల ఉత్సవం

ABN , First Publish Date - 2022-01-29T06:14:08+05:30 IST

రాష్ట్రంలోనే ఏకరాత్రి ఉత్సవంగా ప్రసిద్ధి చెందిన అనకాపల్లి గవరపాలెం గౌరీపరమేశ్వరుల మహోత్సవం శనివారం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు.

నేడు గవరపాలెం గౌరీపరమేశ్వరుల ఉత్సవం
గౌరీపరమేశ్వరులు

సుందరంగా తీర్చిదిద్దిన ఆలయం

ఆకట్టుకుంటున్న విద్యుత్‌ సెట్టింగ్‌లు


అనకాపల్లి టౌన్‌, జనవరి 28: రాష్ట్రంలోనే ఏకరాత్రి ఉత్సవంగా ప్రసిద్ధి చెందిన అనకాపల్లి గవరపాలెం గౌరీపరమేశ్వరుల మహోత్సవం శనివారం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. వేకువజామున నాలుగు గంటలకు సతకంపట్టులోని ఆలయంలో గౌరీపరమేశ్వరులకు అర్చకులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు ఉత్సవమూర్తులను ప్రత్యేక రథంపై ఏర్పాటుచేసి పురవీధుల్లో ఊరేగించనున్నట్టు ఉత్సవ కమిటీ చైర్మన్‌ కె.సంతోశ్‌ అప్పారావునాయుడు తెలిపారు. ఉత్సవంలో భాగంగా విజయనగరం, మండపేట, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, అమలాపురం, ఏలేశ్వరం, విశాఖపట్నం ప్రాంతాల కళాకారులతో వివిధ రకాల నేలవేషాలను ఏర్పాటు చేశారు. అమ్మవారి ఆలయాన్ని పువ్వులు, విద్యుత్‌ అలంకరణలతో అందంగా తీర్చిదిద్దారు. గవరపాలెంతో పాటు పట్టణ పరిధిలోని మెయిన్‌రోడ్డులో కోల్‌కతా వారి ట్రిక్‌ లైటింగ్‌ ఏర్పాటు చేశారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల నుంచి భక్తులు ఉత్సవాన్ని తిలకించేందుకు రావడం ఆనవాయితీ. శనివారం రాత్రి తొమ్మిది గంటలకు రింగురోడ్డు జంక్షన్‌లోని సంతోషిమాత ఆలయ ముఖద్వారం వద్ద భారీ  ఎత్తున బాణసంచా విన్యాసాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. 


భారీగా పోలీసు బందోబస్తు

ఉత్సవంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనకాపల్లి డీఎస్పీ బి.సునీల్‌ ఆధ్వర్యంలో మరొక డీఎస్పీ, ఎనిమిది మంది సీఐలు, 35 మంది ఎస్‌ఐలు, 280 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తుకు చర్యలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. ముఖ్యమైన కూడళ్లలో పోలీస్‌ పికెట్‌, రద్దీ ప్రాంతాల్లో మూవింగ్‌ పార్టీలు, క్రైమ్‌ సిబ్బంది విధులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. 

Updated Date - 2022-01-29T06:14:08+05:30 IST