నేడు జాతీయ లోక్అదాలత్
ABN , First Publish Date - 2022-06-26T06:14:04+05:30 IST
నేడు జాతీయ లోక్అదాలత్
ఖమ్మం లీగల్ జూన్ 25 : ఖమ్మం జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ టి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆదివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు. సాధారణంగా మూడునెలలకు ఒకసారి రెండో శనివారం జాతీయ లోక్అదాలత్ నిర్వహించడం ఆనవాయితీ కాగా ఈ సారి మే తరువాత అతి కొద్దిరోజులు ఉండటంతో నేటి ఆదివారం నిర్వహించాలని జాతీయ న్యాయసేవాధికార సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు న్యాయసేవాధికారసంస్థ కార్యదర్శి లోక్ అదాలత్ బేంచీలను ఏర్పాటు చేశారు. లోక్ అదాలత్లో భాగంగా మోటారు వాహన ప్రమాద బీమా కేసులను మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఆర్.డ్యానీరూథ్ కోర్టు హాలులో పరిష్కరిస్తారు. జిల్లా కోర్టుకు సంబంధించిన సిబిల్, రాజీపడదగిన క్రిమినల్ కేసులను మూడో అదనపు జిల్లా న్యాయమూర్తి వినోద్ కుమార్ కోర్టు హాలులో పరిష్కరిస్తారు. ఇతర సివిల్ కేసులు, ఫ్రీ లిటిగేషన్ కేసులు, బ్యాంకు కేసులను సీనియర్ సివిల్ జడ్జి జి.శ్రీనివాస్ కోర్టు హాలులో పరిష్కరిస్తారు. ఇతర న్యాయమూర్తులు ఎన్.అనిత రెడ్డి, ఎన్.శాంతి సోని, పి.మౌనిక, ఎన్.హెచ్. పూజిత, ఇ.భారతి, ఆర్.శాంతిలత వారి కోర్టులకు సంబంధించిన రాజీపడదగిన క్రిమినల్ కేసులను వారి కోర్టు హాలులో పరిష్కరిస్తారు. కక్షిదారుల సౌకర్యార్థం భారతీయ స్టేట్బ్యాంక్ సౌజన్యంతో ఆహార పొట్లాలు, తాగునీరు అందజేయనున్నారు.
విస్తృత సమావేశాలు
జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ సంఖ్యలో కేసులను పరిష్కరించాలనే ఆశయంతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో మే 21నుంచే సన్నాహక సమావేశాలు ప్రారంభించారు. పోలీసు సిబ్బంది, అధికారులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, బ్యాంక్ ఇతర ఆర్థిక సంస్థల ప్రతినిధులతో విస్తృత సమావేశాలు నిర్వహించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో జిల్లా న్యాయమూర్తి ప్రత్యేక సమావేశం నిర్వహించిన ఫలితంగా అర్హమైన కేసులలో 75శాతం వరకు తగ్గింపు ఇవ్వనున్నట్టు కూడా బ్యాంక్ అధికారులు ప్రకటించారు. కేసు పరిష్కారానికి సంబంధించి ఏ ఒక్క చర్యను విస్మరించకుండా చేపట్టినట్టు సంస్థ కార్యదర్శి ఎంఎ జావీద్ పాషా ప్రకటించారు. ఇక అవకాశాలను వినియోగించుకోవడం కక్షిదారుల వంతని ఆయన తెలిపారు.