ఆ టోల్‌ప్లాజాలను తొలగించండి

ABN , First Publish Date - 2022-03-18T14:57:30+05:30 IST

చెన్నై మహానగరం చుట్టుపక్కలున్న ఐదు టోల్‌ప్లాజాలను తొలగించాలని కేంద్ర జాతీయ రహదారుల శాఖామంత్రి నితిన్‌ గడ్కరీకి రాష్ట్ర ప్రజాపనుల శాఖామంత్రి ఏవీ.వేలు

ఆ టోల్‌ప్లాజాలను తొలగించండి

                   - నితిన్‌ గడ్కరీకి మంత్రి వేలు వినతి


అడయార్‌(చెన్నై): చెన్నై మహానగరం చుట్టుపక్కలున్న ఐదు టోల్‌ప్లాజాలను తొలగించాలని కేంద్ర జాతీయ రహదారుల శాఖామంత్రి నితిన్‌ గడ్కరీకి రాష్ట్ర ప్రజాపనుల శాఖామంత్రి ఏవీ.వేలు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం చెన్నై నగర శివారు ప్రాంతాల్లో బరనూరు, చెన్నసముద్రం, వానగరం, సూరాప్పట్టు, నెమిలి ప్రాంతల్లో టోల్‌ప్లాజాలున్నాయి. వీటిని తొలగించాలని కేంద్ర మంత్రికి విఙ్ఞప్తి చేసినట్టు మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం అధికారిక పర్యటనలో ఆయన ఢిల్లీ వెళ్లారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో సమావేశమై వినతి పత్రం అందించారు. చెన్నై సహా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన రహదారుల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ఆ తర్వాత ఢిల్లీలో మంత్రి వేలు మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కారీకి పది అంశాలతో కూడిన వినతి పత్రం అందజేసానని, ఇందులో చెంగల్పట్టు నుంచి దిండివనం వరకు 8 లేన్ల రహదారిగా మార్చాలని, చెన్నై - తడ మార్గంలో మాధవరం జంక్షన్‌ నుంచి చెన్నై ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకు 6 లేన్ల రహదారిగా మార్చాలని కోరినట్టు చెప్పారు. తాంబరం నుంచి చెంగల్పట్టు వరకు ఫ్లైవోవర్‌, వాలాజా - పూందమల్లి నుంచి శ్రీపెరంబుదూరు టోల్‌గేట్‌ వరకు 6 లేన్ల రహదారి నిర్మాణం చేపట్టాలని కోరినట్టు తెలిపారు. అదేవిధంగా కోయంబత్తూరు - సత్యమంగళం ప్రాంతాల మధ్య జాతీయ రహదారి, కోవైలో ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరినట్టు వెల్లడించారు. ప్రధానంగా మున్సిపాలిటీ, కార్పొరేషన్‌ సరిహద్దుల పరిధిలో ఉన్న (చెన్నై కార్పొరేషన్‌) ఐదు టోల్‌ప్లాజాలను తొలగించాలని కోరినట్టు తెలిపారు.  అలాగే, రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కొత్త రహదారుల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరినట్టు చెప్పారు. 

Updated Date - 2022-03-18T14:57:30+05:30 IST