Prime Minister Modi's visit: ఏం బోధిస్తారో?

ABN , First Publish Date - 2022-07-27T15:22:57+05:30 IST

చెస్‌ ఒలంపియాడ్‌ పోటీలను ప్రారంభించేందుకు ఈ నెల 28న నగరానికి రానున్న ప్రధాని నరేంద్రమోదీతో అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి

Prime Minister Modi's visit: ఏం బోధిస్తారో?

                             - రేపు మోదీతో ఈపీఎస్‌, ఓపీఎస్‌ వేర్వేరుగా భేటీ


చెన్నై, జూలై 26 (ఆంధ్రజ్యోతి): చెస్‌ ఒలంపియాడ్‌ పోటీలను ప్రారంభించేందుకు ఈ నెల 28న నగరానికి రానున్న ప్రధాని నరేంద్రమోదీతో అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి(Edappadi Palaniswami), మాజీ ముఖ్యమంత్రి ఒ. పన్నీర్‌సెల్వం వేర్వేరుగా కలుసుకోనున్నారు. చెస్‌ ఒలంపియాడ్‌ ప్రారంభోత్సవ వేడుకల పూర్తయిన తర్వాత మోదీ గిండిలోని రాజ్‌భవన్‌లో బసచేయనున్నారు. ఆ సందర్భంగా నగరానికి చెందిన పలువురు ప్రముఖులు, బీజేపీ రాష్ట్ర నాయకులను కలుసుకోనున్నారు. రాత్రి 8.30 గంటలకు ప్రధాని మోదీ నగర ప్రముఖులతోపాటు ఈపీఎస్‌, ఓపీఎస్‏లను కలుసుకునేందుకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చారని తెలుస్తోంది. ఇటీవల ఈపీఎస్‌ ఢిల్లీ వెళ్ళి మాజీ రాష్ట్రపతి రామనాధ్‌కోవింద్‌(Ramanad Kovind) వీడ్కోలు కార్యక్రమంలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా(Amit Shah)ను కలుసుకున్నారు. అయితే వారితో ప్రత్యేకంగా భేటీ అయ్యేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన ఈపీఎస్(Eps)ను పార్టీ మిత్రపక్షాలైన పీఎంకే తదితర పార్టీలు హర్షం ప్రకటించినా బీజేపీ మాత్రం మౌనం పాటించింది. అన్నాడీఎంకే సంక్షోభ పరిస్థితులపై ఆచితూచి వ్యవహరించాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. పార్టీలోని రెండు వర్గాల్లో ఎవరికి మద్దతిచ్చినా దాని ఫలితం వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రభావం చూపవచ్చని బీజేపీ జాతీయ నాయకులు భావిస్తున్నారు. ఈ కారణంగా ఈపీఎస్‌, ఓపీఎస్‌ వర్గాలకు మద్దతు ప్రకటించకుండానే ఇద్దరితోనూ సఖ్యత కొనసాగించేందుకే ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈపీఎస్‌, ఓపీఎస్‌ ఈ నెల 28 రాత్రి ప్రధాని మోదీని వేర్వేరుగా కలుసుకోనున్నారు. ఈ సందర్భంగా మోదీ ఏం మాట్లాడతారన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Updated Date - 2022-07-27T15:22:57+05:30 IST