‘సెంచరీ’ దాటిన టమాటా!

ABN , First Publish Date - 2022-05-24T08:51:26+05:30 IST

టమాటా ధరలు కొండెక్కాయి. కిలో వంద రూపాయలు దాటి వినియోగదారులను బెంబేలెత్తిస్తున్నాయి.

‘సెంచరీ’ దాటిన టమాటా!

కర్నూలులో కిలో రూ.100 -120

మదనపల్లె నుంచి దిగుమతి

రైతుకు దక్కేది కిలోకు రూ.50

దళారులు, బడా వ్యాపారులకే లాభాలు

చితికిపోతున్న రైతులు, వినియోగదారులు

సాగు విస్తీర్ణం తగ్గడం, ఎగుమతులు పెరగడంతో అగచాట్లు


కర్నూలు, మే 23 (ఆంధ్రజ్యోతి): టమాటా ధరలు కొండెక్కాయి. కిలో వంద రూపాయలు దాటి వినియోగదారులను బెంబేలెత్తిస్తున్నాయి. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ప్రధాన కూరగాయల మార్కెట్లో టమాటా నాణ్యతను బట్టి కిలో రూ.100-120పైగానే విక్రయిస్తున్నారు. బోరుబావుల కింద సాగు చేసిన టమాటా, బీర, బెండ తోటలు చివరి దశకు చేరడంతో ధరలు చుక్కలనంటుతున్నాయి. స్థానికంగా దిగుబడులు లేకపోవడంతో చిత్తూరు జిల్లా మదనపల్లె, గుర్రంకొండ మార్కెట్ల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లె, గుర్రంకొండ, కలకడ, అన్నమయ్య జిల్లా చిన్నమండెం, సంబేపల్లి, లక్కిరెడ్డిపల్లె మండలాల్లో హైబ్రీడ్‌ తీగ జాతి రకం టమాటా సాగు చేస్తున్నారు. భూమిపై ప్లాస్టిక్‌  కవర్‌ (మల్చి ంగ్‌), కర్ర పందిరి వేసి సాగు చేస్తుండడం వల్ల ఎకరాకు రూ.1.50-2 లక్షలు పెట్టుబడి అవుతోందని చిన్నమండెంకు చెందిన రైతు హరిబాబు పేర్కొన్నారు. టమాటా సాగుకు అక్కడి వాతావరణం అనుకూలించడంతో మదనపల్లె నుంచి రాయలసీమ జిల్లాలకే కాకుండా బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. తాజాగా నాణ్యతను బట్టి కిలో రూ.100-120కి విక్రయిస్తున్నారు. వీధి వ్యాపారులైతే కిలో రూ.150కు వరకు అమ్ముతున్నారు.


మార్కెట్‌ మాయాజాలం

ధర ఇంత ఉన్నా రైతులు, వినియోగదారులు మాత్రం నష్టపోతుండగా  దళారులు, బడా వ్యాపారులు బాగా లాభపడుతున్నారు. మదనపల్లె మార్కెట్‌లో టమాటా క్రేట్‌ (30 కిలోలు) నాణ్యతను బట్టి రూ.1,800-2,500లు పలుకుతోందని రైతులు అంటున్నారు. అంటే సగటున రూ.2 వేలకు మించదు. కిలో రూ.65 పడుతుంది. ఈ మొత్తం రైతుకు చేరితే అన్నదాత ఆర్థికంగా లాభపడినట్టే. ఇక్కడే మాయాజాలం ఉంది. మదనపల్లె మార్కెట్‌కు రైతులు టమాటా దిగుబడులు అమ్మకానికి తీసుకెళితే.. కమిషన్‌ ఏజెంట్‌ (దళాలీ) జాక్‌పాట్‌ కింద పది క్రేట్‌లకు ఒక క్రేట్‌ ఉచితంగా ఇవ్వాలి. అమ్మకం మొత్తంలో పది శాతం రిటర్న్‌ కమిషన్‌ (క్రేట్‌ రూ.2 వేలు పలికితే రూ.200), మరో పది శాతం కమిషన్‌ కలిపి 20 శాతం ఇవ్వాలి. ఇది కాదని క్రేట్‌ బాడుగ రూ4, హమాలీ రూ.2, రవాణా రూ.30లు కలిపి 30 కిలోల క్రేట్‌ రూ.2 వేలకు అమ్ముడుపోతే వివిధ రూపాల్లో రూ.636 పోనూ రైతుకు వచ్చేది క్రేట్‌పైన రూ.1,364లే. అంటే.. కిలో రూ.45 మించదు. మార్కెట్లో అమ్ముతున్నది మాత్రం కిలో రూ.100 పైమాటే. రైతుకు వినియోగదారుల మధ్య కిలోకు రూ.50-55లు దళారులు, కమిషన్‌ ఏజెంట్లు, వ్యాపారులు లాభపడుతున్నారు. రాయలసీమ జిల్లాల్లో అంతటా ఇదే రకమైన దోపిడీ సాగుతోంది. మార్కెట్‌ మాయాజాలాన్ని అరికడితే పండించిన రైతులు, చివరిగా కొనుగోలు చేసే వినియోగదారులకు లాభపడే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. 

Updated Date - 2022-05-24T08:51:26+05:30 IST