టమాటా రూ.60
ABN , First Publish Date - 2022-05-18T07:16:04+05:30 IST
టమాటా ధర మంగళవారం రైతుబజార్లలో రూ.4 తగ్గడంతో కొనుగోలుకు నగరవాసులు ఎగబడ్డారు.
రైతుబజార్లలో రూ.4 తగ్గింపు
నగరానికి 13 టన్నుల దిగుబడి
బహిరంగ మార్కెట్లో రూ.80
విశాఖపట్నం, మే 17 (ఆంధ్రజ్యోతి): టమాటా ధర మంగళవారం రైతుబజార్లలో రూ.4 తగ్గడంతో కొనుగోలుకు నగరవాసులు ఎగబడ్డారు. టమాటా ధరలు భారీగా పెరిగిపోవడంతో మార్కెటింగ్ శాఖాధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. మంగళవారం భారీగా సరకు తెప్పించారు. శని, ఆదివారాల్లో కిలో రూ.68, సోమవారం కిలో రూ.64 ధర పలకగా, మంగళవారం కిలో రూ.60 చొప్పున విక్రయించారు. మొత్తం 13 టన్నుల టమాటా రాగా, ఒక్క ఎంవీపీ కాలనీ రైతు బజారుకే ఆరు టన్నులు కేటాయించినట్టు మార్కెటింగ్ శాఖ సెక్రటరీ పాపారావు తెలిపారు.
స్థానికంగా పంట లేకనే...
అకాల వర్షాలతో జిల్లాలో రైతులు వేసిన టమాటా పంట దిగుబడి తగ్గిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. అన్ సీజన్లో జిల్లాలకు అవసరమైన టమాటాను చిత్తూరు జిల్లా మదనపల్లెతో పాటు కోలార్, రాయపూర్ నుంచి తెప్పిస్తారు. విశాఖకు రాయపూర్ దగ్గర కావడంతో రవాణా ఖర్చులు తగ్గి, ధర కూడా అందుబాటులో ఉండేది. అయితే ఈ ఏడాది రాయపూర్లో కూడా టమాటా దిగుబడి పడిపోయింది. దీంతో పూర్తిగా మదనపల్లె పంటపైనే ఆధార పడాల్సి వచ్చింది. తమిళనాడు మార్కెట్లు కూడా మదనపల్లె నుంచి కొనుగోలు చేస్తుండడంతో డిమాండ్ పెరిగిపోయింది. మదనపల్లెలో 25 కిలోల ట్రే రూ.1,600, నాణ్యమైన టమాటా 15 కిలోల ట్రే రూ.1,100 చొప్పున విక్రయిస్తున్నారు. ఆ సరకు విశాఖకు వచ్చేసరికి రవాణా చార్జీలతో కలిసి ధర పెరిగిపోతోంది. నగరంలోని రైతుబజార్లలో కిలో రూ.60, బహిరంగ మార్కెట్లో కిలో రూ.80 ధర పలుకుతోంది. అంతేకాకుండా నగరానికి చేరిన సరకును అనకాపల్లి, పాడేరు తదితర ప్రాంతాలకు తరలించి, అమ్మకాలు చేపడుతుండడంతో ధర మరింత పెరుగుతోంది. నర్సీపట్నం వంటి ప్రాంతాల్లో కిలో రూ.100 చొప్పున అమ్ముతున్నారు. జిల్లాలో మళ్లీ రైతులు పంట వేసి, దిగుబడి వచ్చేవరకు ధరలు ఇదే విధంగా కొనసాగే అవకాశాలున్నాయని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు.