రైతుబజార్లలో రాయితీపై టమాటా
ABN , First Publish Date - 2022-05-21T06:52:47+05:30 IST
టమాటా ధరలు బహిరంగ మార్కెట్లో అధికంగా ఉన్న నేపథ్యంలో రైతుబజార్లలో తక్కువ ధరకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
కిలో రూ.60కు విక్రయం
నేడు నగరానికి 20 టన్నులు రాక
విశాఖపట్నం, మే 20 (ఆంధ్రజ్యోతి): టమాటా ధరలు బహిరంగ మార్కెట్లో అధికంగా ఉన్న నేపథ్యంలో రైతుబజార్లలో తక్కువ ధరకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పంట దిగుబడి తక్కువగా ఉండడం, ఆంధ్రప్రదేశ్తో పాటు పొరుగు రాష్ట్రాలు కూడా టమాటా కోసం మదనపల్లె (చిత్తూరు జిల్లా)పై ఆధారపడడంతో డిమాండ్ అధికమై ధర పెరిగిపోయింది. బహిరంగ మార్కెట్లో కిలో రూ.80 నుంచి రూ.100 వరకు విక్రయిస్తున్నారు. రైతుబజార్లలో డ్వాక్రా సంఘాలు కిలో రూ.64 చొప్పున అమ్ముతున్నాయి. ప్రభుత్వమే నేరుగా కొని శుక్రవారం విశాఖకు 2.7 టన్నులు పంపించింది. ఆ సరకును ఎంవీపీ కాలనీ రైతుబజార్లోనే కిలో రూ.60 చొప్పున విక్రయించారు. దీనిపై వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సెక్రటరీ పాపారావు మాట్లాడుతూ, శనివారం విశాఖపట్నానికి మరో 20 టన్నుల టమాటా వస్తుందని, అన్ని రైతుబజార్లకు అందించి, కిలో రూ.60 చొప్పున విక్రయిస్తామని చెప్పారు. టమాటా ధరలు తగ్గేంత వరకు రాయితీపై అందించడానికి ఉన్నతాధికారులు చర్యలు చేపడుతున్నారని వివరించారు.