రైతు బజార్లలో టమోటాలు
ABN , First Publish Date - 2022-05-25T05:30:00+05:30 IST
బహిరంగ మార్కెట్లో టమోటాల ధర చుక్కలను తాకుతోంది. కిలో రూ.100కు పైనే విక్రయిస్తున్నారు.
రోజూ 6 వేల టన్నుల దాకా విక్రయం
కర్నూలు(అగ్రికల్చర్), మే 25: బహిరంగ మార్కెట్లో టమోటాల ధర చుక్కలను తాకుతోంది. కిలో రూ.100కు పైనే విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారులకు భారం తగ్గించేందుకు మార్కెటింగ్ శాఖ ముందుకొచ్చింది. మదనపల్లె నుంచి టమోటాలను కొనుగోలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్లలో తక్కువ ధరకు అందించేందుకు బుధవారం నుంచి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కర్నూలు జిల్లాలోని 5 రైతుబజార్లలో కిలో టమోటా రూ.65కు విక్రయించేందుకు ఎస్టేట్ అధికారులు చర్యలు తీసుకున్నారు. బుధవారం సీ-క్యాంపు రైతు బజారులో మూడున్నర టన్నుల టమోటాలను దిగుమతి చేసుకున్నారు. అమీన అబ్బాస్ నగర్, కొత్తపేటతో పాటు, నంద్యాల, ఆదోని రైతు బజార్లలో టమోటాలను కిలో రూ.65 వంతున విక్రయించేందుకు చర్యలు తీసుకున్నామని మార్కెటింగ్ శాఖ ఏడీఎం సత్యనారాయణ చౌదరి తెలిపారు. సీ-క్యాంపు రైతు బజారులో ఎస్టేట్ అధికారులు కల్యాణమ్మ, సిబ్బంది శివకుమార్, సెక్యూరిటీ గార్డులు శ్రీనివాసరెడ్డి, హనుమంతు, గోపాల్, గురువయ్య తదితరులు టమోటాలను విక్రయించడంలో తొక్కిసలాట లేకుండా అందరికీ అందేలా చర్యలు తీసుకున్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రైతు బజార్ ఎస్టేట్ అధికారి కల్యాణమ్మ తెలిపారు.