కొవిడ్ టీకాను సద్వినియోగం చేసుకోవాలి
ABN , First Publish Date - 2021-03-01T06:49:02+05:30 IST
కొవిడ్ టీకాను సద్వినియోగం చేసుకోవాలి
కలెక్టర్ వీపీ.గౌతమ్
మహబూబాబాద్, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి) : సాధారణ ప్రజలకు అందజేసే కొవిడ్ వ్యాక్సినేషన్ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వీపీ.గౌతమ్ కోరారు. వ్యాక్సినేషన్పై మహబూబాబాద్ నుంచి ఆదివారం ఆయన టెలీ కాన్ఫరెన్స్లో వైద్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా ఆస్పత్రిలో సోమవారం కొవిడ్ టీకా తీసుకునేందుకు 60 సంవత్సరాలు దాటిన వారు ముందుకు రావాలని సూచించారు. 45-59 సంవత్సరాల్లోపు వయస్సు ఉన్న వారి ఆరోగ్య స్థితిగతులపై సంబంధిత డాక్టర్లచే ధృవీకరణపత్రాలు తీసుకువచ్చి అర్హులైన వారు కొవిడ్ టీకా పొందవచ్చని పేర్కొన్నారు. టీకా తీసుకునే ముందు యాప్లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాని ఆపై టీకా వేసుకునేందుకు ఆధార్, ఓటర్ ఐడీ, పాస్పోర్ట్, పెన్షన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి గుర్తింపు కార్డుల్లో ఎదో ఒకటి తప్పనిసరిగా వెంట తీసుకురావాలన్నారు. ప్రతీ కేంద్రంలో నిత్యం 200 మందికి మాత్రమే వ్యాక్సిన్ వేయనున్నట్లు పేర్కొన్నారు. టీకా వేసేందుకు జిల్లాలో మూడు ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు మహబూబాబాద్లో రెండు, తొర్రూరులో ఒకదానికి అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. ప్రతీ ఒక్కరు రెండు డోసుల వ్యాక్సినేషన్ తప్పకుండా వేసుకోవాలన్నారు. టీకా కోసం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. వ్యాక్సినేషన్ను విజయవంతం చేసేందుకు అదనపు కలెక్టర్ అభిలాషఅభినవ్, ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి కృషి చేయాలని కోరారు. జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ బి.వెంకట్రాములు, డీఎంహెచ్వో శ్రీరాం, నోడల్ అధికారి రాజేష్, డీఆర్డీఏ పీడీ విద్యాచందన పాల్గొన్నారు.