ఓట్ల లెక్కింపులో అధికారుల అవకతవకలు
ABN , First Publish Date - 2021-05-07T06:42:07+05:30 IST
ఓట్ల లెక్కింపులో అధికారుల అవకతవకలు
న్యాయం చేయాలని సెల్ టవర్ ఎక్కిన బీజేపీ నాయకుడు
రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హామీ మేరకు నిరసన విరమణ
ఖిలావరంగల్, మే 6: ఓట్ల లెక్కింపులో తనకు అన్యాయం జరిగిందని, న్యాయం చేయాలని 34వ డివిజన్ బీజేపీ అభ్యర్థి బైరి శ్యామ్సుందర్ గురువారం శివనగర్లో సెల్టవర్ ఎక్కి ఆందోళన చేశారు. విషయం తెలువడంతో ప్రజలు, అగ్నిమాపక వాహనంతో పాటు పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ అభ్యర్థి బైరి శ్యామ్సుందర్ మాట్లాడుతూ.. ఇటీవల గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో 34వ డివిజన్ శివనగర్నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీలో నిలవగా టీఆర్ఎస్ నాయకులు, పోలీసుల చేతిలో తీవ్ర అవమానం జరిగిందన్నారు. ఇటీవల నిర్వహించిన ఎన్నికల కౌంటింగ్లో మధ్యాహ్నం వరకు తాను టీఆర్ఎస్ అభ్యర్థి దిడ్డి కుమారస్వామిపై 410 ఓట్ల మెజారిటీతో గెలిచినట్లు మాధ్యమాలలో వచ్చిందన్నారు. కానీ, వరంగల్ తూర ్పు ఎమ్మెల్యే నరేందర్, ప్రభుత్వ అధికారులు మోసం చేసి తనకు తక్కువ ఓట్లు వచ్చినట్లుచూపి, టీఆర్ఎస్ అభ్యర్థి కుమారస్వామి 11ఓట్ల మెజారిటీతో గెలిచినట్లుగా చూపారన్నారు. ఇది ప్రజాస్వామ్య విరుద్ధం అన్నారు. అధికారం ఉంటే ఏదైనా చేయవచ్చా అని ఆయన విమర్శించారు. రెండు రోజులనుంచి కలెక్టర్, కమిషనర్లను కలవాలని చూసినా ఎవరూ అందుబాటులో లేరన్నారు. అధికారులు 34వ డివిజన్ ఓట్లను రీకౌంటింగ్ చేసి తనకు న్యాయం చేయాలన్నారు.
విషయం తెలియడంతో శివనగర్కు మిల్స్కాలనీ సీఐ రవికిరణ్, వరంగల్ ఏసీపీ గిరికుమార్లు చేరుకోని శ్యామ్సుందర్ను సెల్టవర్ దిగి కిందికి రావాల్సిందాగా కోరారు. చివరికి బీజేపీ నాయకులు చింతాకుల సునిల్, కుసుమ సతీ్షలు చేరుకుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్తో మాట్లాడించారు. హైకోర్టులో ఎల్లుండి పిటిషన్ వేస్తున్నామని, హైదరాబాద్కు రావాల్సిందిగా ఆయన చెప్పడంతో శ్యామ్సుందర్ నిరసనను విరమించారు.