ఇల్లు..ఆఫీసు.. ఒకేచోట..!
ABN , First Publish Date - 2022-08-09T05:56:54+05:30 IST
ఇల్లు.. ఆఫీసు, బడి.. గుడి, హోటళ్లు.. సినిమా థియేటర్లు.. ఇలా అన్నీ ఒకే చోట ఉండే ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణానికి హెచ్ఎండీఏ కసరత్తు చేస్తోంది.
మోకిలలో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్
వాక్ టూ వర్క్ కాన్సెఫ్ట్తో డిజైన్
కోకాపేటకు సమీపంలోనే 165 ఎకరాలు
కసరత్తు చేస్తున్న హెచ్ఎండీఏ
రూ.2 వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అంచనా
హైదరాబాద్ సిటీ, ఆగస్టు8 (ఆంధ్రజ్యోతి) : ఇల్లు.. ఆఫీసు, బడి.. గుడి, హోటళ్లు.. సినిమా థియేటర్లు.. ఇలా అన్నీ ఒకే చోట ఉండే ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణానికి హెచ్ఎండీఏ కసరత్తు చేస్తోంది. నగర శివారు కోకాపేటకు సమీపంలోని మోకిలలో ఇందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రయాణాలు మినహా వాహన వినియోగం అవసరం లేకుండానే విదేశీ తరహాలో అధునాతనమైన ప్రపంచాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. మలేషియాలోని కౌలాలంపూర్ సహా పలు దేశాల్లో అందుబాటులో ఉన్న వాక్ టూ వర్క్ కాన్సెఫ్ట్తో దీన్ని రూపొందించనుంది.
గ్రేటర్ హైదరాబాద్ శివారులోని రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మోకిల రెవెన్యూ గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 96లో 353.23 ఎకరాల హెచ్ఎండీ భూమి ఉంది. ఇందులో సుమారు 188 ఎకరాలకు పైగా గతంలో భూమి లేని నిరుపేదలకు అసైన్డ్ భూమి కింద కేటాయించారు. కొంత భూమిని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కూడా పలువురికి కేటాయించింది. 353 ఎకరాల్లో వివిధ కేటాయింపులు పోగా 165 ఎకరాల వరకు మిగిలి ఉంది. ఇందులో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ తీసుకొచ్చేందుకు హెచ్ఎండీఏ చర్యలు చేపట్టింది. నార్సింగ్ నుంచి పది కిలోమీటర్ల దూరంలో శంకర్పల్లికి వెళ్ళే ప్రధాన రహదారికి ఆనుకుని ఈ భూమి ఉంది. కోకాపేటలో హెచ్ఎండీఏ ఇప్పటికే అభివృద్ధి చేస్తున్న నియో పోలీసు లే అవుట్కు సమీపంలో ఉండడంతో వాక్ టూ వర్క్ కాన్సెఫ్ట్తో అభివృద్ధి చేసేందుకు హెచ్ఎండీఏ కసరత్తు చేస్తోంది.
రూ. 3 వేల కోట్ల వరకూ..
అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలతో నిర్మించాలని భావిస్తోన్న మోకిల టౌన్షిప్ ద్వారా రూ.2వేల కోట్ల నుంచి రూ.3వేల కోట్ల వరకు ఆదాయం వస్తుందని హెచ్ఎండీఏ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆఫీస్ స్పేస్, కమర్షియల్ స్పేస్ నిర్వహణ చేపడితే ఏటా ఆదాయం కూడా వచ్చే అవకాశాలున్నాయి. టౌన్షిప్ను అభివృద్ధి చేసి విక్రయించడం ద్వారా వచ్చే ఆదాయ, వ్యయాలను కూడా అంచనాలు వేసినట్లు తెలిసింది. పలు ప్రతిపాదనల ఆధారంగా ప్రభుత్వ నిర్ణయానుసారం అధునాతనమైన టౌన్షిప్ ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి.
భారీగా గేటెడ్ కమ్యూనిటీ కాలనీలు
నార్సింగ్ నుంచి శంకర్పల్లికి వెళ్లే ప్రధాన రహదారిలో గండిపేట తర్వాత అత్యధికంగా గేటెడ్ కమ్యూనిటీ కాలనీలు మోకిలలోనే ఉన్నాయి. పలు రియల్ ఎస్టేట్ సంస్థలతో పాటు పలువురు డెవలపర్లు పెద్దఎత్తున వీటిని ఏర్పాటు చేశారు. ఐటీ కారిడార్కు పది కిలోమీటర్ల దూరం ఉండడం, ట్రాఫిక్ రద్దీ లేకపోవడంతో ఐటీ ఉద్యోగులు పెద్దఎత్తున కొనుగోలు చేశారు. వ్యాపారులు, సినీ పరిశ్రమకు చెందినవారు కూడా మోకిలలోని పలు గేటెడ్ కమ్యూనిటీ కాలనీలో విల్లాలను సొంతం చేసుకున్నారు. మోకిల మినహా పరిసర ప్రాంతమంతా 111జీఓ పరిధిలో ఉండడంతో విల్లా ధర కోట్లలో పలుకుతోంది. ఈ ప్రాంతంలోనే వాక్ టూ వర్క్ కాన్సె్ప్టతో టౌన్షిప్ తీసుకొస్తే హాట్ కేకులా అమ్ముడవుతుందని అధికారులు అంచనాలు వేశారు.
పది శాతం గ్రీనరీ
గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మినీ నగరాల తరహాలో టౌన్షి్పలను తీసుకురావడానికి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సంస్థలను, డెవలపర్లను ప్రొత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పాలసీ-2020 తీసుకొచ్చింది. ఈ పాలసీ కింద టౌన్షి్పలను ఏర్పాటు చేసే సంస్థలకు రాయితీలను ప్రకటించింది. పలు రియల్ సంస్థలు నగర శివారులోని వివిధ ప్రాంతాల్లో టౌన్షి్పలను తీసుకొస్తున్నట్లు ప్రచారం చేస్తున్నాయి. పలు అభివృద్ధి చెందిన దేశాల్లో వాక్ టు వర్క్ కాన్సె్ఫ్టతో టౌన్షి్పలు రాగా, దేశంలోనూ వివిధ మెట్రోపాలిటన్ నగరాలు టౌన్షి్పల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నాయి. ఈ టౌన్షి్పలలో నివాస ప్రాంతాలు, వ్యాపార వాణిజ్య ప్రాంతాలు, కార్యాలయాలు అన్నీ ఒకే చోట ఉంటాయి. ఇంటిగ్రేటెడ్ టౌన్షి్పలలో 40 శాతం ఏరియా మౌలిక సదుపాయాలకు కాగా, అందులో 10 శాతం గ్రీనరీకి కేటాయించనున్నారు. ఉద్యోగులు, ప్రజలు తమ అవసరాల కోసం టౌన్షి్పను దాటి వెళ్లాల్సిన అవసరం లేకుండా నిర్మించనున్నారు. గండిపేటకు సమీపంలో ఉండే మోకిలలో టౌన్షిప్ ఏర్పాటు వల్ల అనూహ్యమైన స్పందన వస్తుందని అంచనాలతో ఇంటిగ్రేటెడ్ టౌన్షి్పకు ప్లాన్ చేసినట్లు సమాచారం.