విష వాయువు కలకలం
ABN , First Publish Date - 2022-01-21T07:30:26+05:30 IST
భూదాన్పోచంపల్లి మునిసిపాలిటీ కేంద్రంలోని ఆరు కాలనీల్లో విషవాయువు కలకలం రేపింది.
ఘాటైన వాసనతో ప్రజల ఇబ్బందులు
భూదాన్పోచంపల్లిలో ఘటన
భూదాన్పోచంపల్లి, జనవరి 20: భూదాన్పోచంపల్లి మునిసిపాలిటీ కేంద్రంలోని ఆరు కాలనీల్లో విషవాయువు కలకలం రేపింది. భావనారుషిపేట, లక్ష్మణ్నగర్కాలనీ, సిల్కుసిటీ పోచంపల్లి, మాధవనగర్కాలనీ, రాజీవ్నగర్కాలనీల్లో సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి 9గంటల వరకు గాలిలో విషవాయువు రావడంతో కాలనీల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఘాటైన వాసనతో ఊపిరి పీల్చుకునేందుకు కూడా ఇబ్బంది పడ్డారు. భూదాన్పోచంపల్లి మునిసిపాలిటీ పరిధిలోని నారాయణగిరి ప్రాంతంలోని కెమికల్ కంపెనీతోపాటు, దోతిగూడెం అంత్మగూడెం గ్రామాల్లోని కెమికల్ కంపెనీలు గాలిలోకి వదిలే విషవాయువులతో పట్టణ ప్రజలు తరుచూ ఇబ్బందులు పడుతున్నారు. వారంలో రెండుసార్లు విష వాయువులు పీల్చలేక తాము ఇబ్బందులు పడుతున్నామని, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని స్థానికుడు చింతకింది కిరణ్ తెలిపాడు. కెమికల్ కంపెనీలపై కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.