టిపిసిసి ఎన్నారై సెల్ గల్ఫ్ నూతన కన్వీనర్‌ నరేష్ రెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అభినందనలు!

ABN , First Publish Date - 2022-06-28T00:48:17+05:30 IST

నరేష్ రెడ్డిని పీసీసీ అధ్యక్షులు ఎ.రేవంత్ రెడ్డి గాంధీ భవన్‌‌లోని తన చాంబర్‌లో అభినందించారు.

టిపిసిసి ఎన్నారై సెల్ గల్ఫ్ నూతన కన్వీనర్‌ నరేష్ రెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అభినందనలు!

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) ఎన్నారై సెల్ గల్ఫ్ కన్వీనర్‌గా జగిత్యాల జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్‌ రెడ్డి నియమితులయ్యారు. కాంగ్రెస్ పార్టీ ప్రవాసీ భారతీయుల విభాగం చైర్మన్ డా.బి.ఎం.వినోద్ కుమార్ సోమవారం (27.06.2022) ఈ మేరకు నియామక పత్రాన్ని గాంధి భవన్‌లో అందజేశారు. ఈ సందర్బంగా నరేష్ రెడ్డిని పీసీసీ అధ్యక్షులు ఎ.రేవంత్ రెడ్డి గాంధీ భవన్‌‌లోని తన చాంబర్‌లో అభినందించారు. గల్ఫ్ కార్మికుల హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి గల్ఫ్ కార్మికుల బాధలు తీరుస్తుందని అన్నారు. 


నరేష్ రెడ్డి జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా, మన్నెగూడెం సర్పంచ్‌గా కొనసాగుతున్నారు. గతంలో 11 ఏళ్లపాటు సౌదీలోని అరేబియన్ అమెరికన్ పెట్రోలియం నేచురల్ గ్యాస్ కంపెనీలో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో లెవల్-1 సర్టిఫైడ్ రిగ్గర్‌గా పనిచేశారు. 'సౌదీ అరామ్కో' కంపెనీలో అత్యంత నైపుణ్యం కలిగిన శ్రామికశక్తి బృందంలో సభ్యుడిగా గుర్తింపు పొందారు. 


ఈ సందర్బంగా నరేష్ రెడ్డి మాట్లాడుతూ.. "తెలంగాణ రాష్ట్రానికి చెందిన సుమారు 15 లక్షల మంది గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, ఓమన్, ఖతర్, కువైట్, బహ్రెయిన్‌తో పాటు 18 ఈసీఆర్ దేశాలకు ఉపాధి కోసం వలస వెళ్లారు. విదేశాల్లో పనిచేసే కార్మికులకు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంలో కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ప్రవాసీ కార్మికుల హక్కుల రక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి పోరాటం చేస్తుంది" అని అన్నారు. "రాష్ట్ర ప్రభుత్వం.. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రతి ఏటా రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయించాలి. గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. కేంద్ర ప్రభుత్వం... హైదరాబాద్‌లో సౌదీ అరేబియా, యుఏఈ కాన్సులేట్‌లు ఏర్పాటు చేసేలా ప్రయత్నించాలి. ఎన్నారైలు తమ ఓటు హక్కును ఆన్‌లైన్ ద్వారా వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయాలి. రూ. 10 లక్షల విలువైన  'ప్రవాసి భారతీయ బీమా యోజన' అనే ప్రమాద బీమాలో సహజ మరణం కూడా కవర్ అయ్యేలా చూడాలి. గల్ఫ్ దేశాల నుండి ఇండియాకు ఇటీవల పెంచిన విమాన చార్జీలను తగ్గించాలి" అని డా.బి.ఎం. వినోద్ కుమార్, సింగిరెడ్డి నరేష్ రెడ్డి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-06-28T00:48:17+05:30 IST