కిచెన్లో అరుదుగా వాడే దాంతో ఇమ్యూనిటీని పెంచుకోవడం ఎలా?
ABN , First Publish Date - 2021-12-06T17:35:19+05:30 IST
వాము కిచెన్లో అందుబాటులోనే ఉన్నా అరుదుగా వాడుతుంటారు. కానీ వాము చాలా మేలు చేస్తుందని అంటున్నారు ఆయుర్వేద వైద్యులు. వాము జీర్ణశక్తిని పెంచుతుంది. జలుబు, దగ్గు వంటి సమస్యలను
ఆంధ్రజ్యోతి(06-12-2021)
వాము కిచెన్లో అందుబాటులోనే ఉన్నా అరుదుగా వాడుతుంటారు. కానీ వాము చాలా మేలు చేస్తుందని అంటున్నారు ఆయుర్వేద వైద్యులు. వాము జీర్ణశక్తిని పెంచుతుంది. జలుబు, దగ్గు వంటి సమస్యలను దూరం చేస్తుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది. ముఖ్యంగా ఈ సీజన్లో వామును తీసుకోవడం చాలా అవసరం. వామును, అల్లం, మిరియాలు, నల్ల జీలకర్ర, మెంతులతో కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. వాముతో సూప్ తయారు చేసుకుని తీసుకోవచ్చు. ఇందుకోసం...
కావలసినవి: వాము - రెండు టేబుల్స్పూన్లు, నల్లజీలకర్ర - అర టీస్పూన్, మెంతులు - అర టీస్పూన్, బిర్యానీ ఆకు - ఒకటి, నెయ్యి - రెండు టేబుల్స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు - ఐదారు, అల్లం - చిన్నముక్క, మిరియాలు - ఐదారు, ఉల్లిపాయ - ఒకటి, పసుపు - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత.
తయారీ ఇలా: వామును శుభ్రంగా కడిగి కొద్దిసేపు నానబెట్టుకోవాలి. అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, మిరియాలను గ్రైండర్లో వేసి పేస్టులా పట్టుకోవాలి. ఆ తరువాత నానబెట్టుకున్న వాము, తగినంత ఉప్పు వేసి మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్పై పాత్రను పెట్టి నెయ్యి వేసి కాస్త వేడి అయ్యాక బిర్యానీ ఆకు, జీలకర్ర, మెంతులు వేసి వేయించాలి. తరువాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్టు వేయాలి. కొద్దిగా పసుపు వేయాలి. ఇప్పుడు రెండు కప్పుల నీళ్లు పోసి ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలి. స్టవ్పై నుంచి దింపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని వేడి వేడి సూప్ సిప్ చేయాలి.