Ranganath: ప్రయోగాత్మకంగా ఆపరేషన్ రోప్ అమలు
ABN , First Publish Date - 2022-10-03T17:30:11+05:30 IST
నగరంలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు ఆపరేషన్ రోప్ను ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు.
హైదరాబాద్: నగరంలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు ఆపరేషన్ రోప్ను ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ (Ranganath) తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... ఆపరేషన్ రోప్లో భాగంగా ఇప్పుడు వరకు 73 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని, 350 వ్యాపార సముదాయాల మీద కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ప్రజలను చలాన్ల ద్వారా వేధించడం తమ అభిమతం కాదని, ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకే ఈ కొత్త నిబంధనలు అని స్పష్టం చేశారు. పార్కింగ్కు ఉపయోగించే సెల్లార్లలో వ్యాపారం నిర్వహించే వారి మీద కేసులు నమోదు చేస్తామన్నారు. వ్యాపారులతో త్వరలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని జాయింట్ సీపీ చెప్పారు.
చలాన్లు వచ్చినవారు వెనువెంటనే చెల్లించాలన్నారు. ఫ్రీ లెఫ్ట్ బ్లాక్ చేసిన వారికి వెయ్యి రూపాయల జరిమానా విధిస్తామన్నారు. ట్రాఫిక్కు అంతరాయం కలిగేలా ఫుట్ పాత్లు అక్రమిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఫుట్పాత్లను ఆక్రమించి వ్యాపారం చేసే వారి వస్తువులను సీజ్ చేసి కోర్టుకు అప్పగిస్తామన్నారు. బిల్డింగ్ ఓనర్ల మీద, అద్దెకు తీసుకున్నవారి మీద కేసులు నమోదు చేస్తామన్నారు. ఇరుకు రోడ్ల వద్ద తోపుడు బండ్లు నిర్వహించే వారిని విశాలమైన ప్రాంతానికి తరలిస్తామని చెప్పారు. సిగ్నల్స్ దాటిన వెంటనే చాలా ప్రాంతాల్లో బస్టాప్లు ఉన్నాయని... వీటి వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుందని.. అలాంటి వాటిని గుర్తించి బస్టాప్లను ముందుకు తరలిస్తామని వెల్లడించారు. ఈ స్పెషల్ ఆపరేషన్ ద్వారా మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నామని రంగనాథ్ అన్నారు.