ఆ ఊరికి దారేది..?

ABN , First Publish Date - 2022-08-09T05:08:08+05:30 IST

వానాకాలం వచ్చిందంటే ఆ గ్రామ ప్రజలు గజగజ వణికిపోతారు.

ఆ ఊరికి దారేది..?
బొదునంపల్లి సమీపంలో పారుతున్న వాగు

  • వాగుపారితే బొదునంపల్లికి రాకపోకలు బంద్‌
  • కల్వర్టు వద్ద బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్థుల విన్నపం


కేశంపేట, ఆగస్టు8 : వానాకాలం వచ్చిందంటే ఆ గ్రామ ప్రజలు గజగజ వణికిపోతారు. జోరుగా వానలు కురిస్తే వరదలు వచ్చి ఆ గ్రామానికి రాకపోకలే బంద్‌ అవుతాయి. ఏళ్లతరబడి ఇబ్బంది పడుతున్న గ్రామస్థుల గోడు వినిపించుకునే నాథుడే కరువయ్యారు. కేశంపేట మండలం బొదునంపల్లి గ్రామంలో ప్రజలు వర్షాకాలం వచ్చిందంటే బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి ఉంది. గ్రామానికి నలువైపులా వాగులు, వంకలు ఉన్నాయి. గ్రామానికి ఎగువప్రాంతమైన కేశంపేట, చౌలపల్లి, రామకృష్ణపూర్‌లలో భారీ వర్షం కురిస్తే... వరదనీరంతా చిన్నవాగులోకి పారుతుంది. ఇటీవల కురిసిన భారీ వర్షానికి చిన్నవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. గ్రామ సమీపంలో ఉన్న కల్వర్టులో నుంచి వరదనీరు సక్రమంగా పారక వాగు సమీపంలో ఉన్న ఇళ్లలోకి వరదనీరు చేరింది. వాగు ఉధృతంగా రోడ్డుపై ప్రవహించడంతో దాదాపు 5గంటలు గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉధృతి తగ్గిన తరువాత గ్రామస్తులు రాకపోకలు సాగించారు. గ్రామంలోకి వరద పరిస్థితిని తహసీల్దార్‌ మురళీకృష్ణ, ఎంపీడీవో రవిచంద్రకుమార్‌రెడ్డి, ఎంపీవో శ్రీనివా్‌సలు పర్యవేక్షించారు. అలాగే గ్రామంలో వరదముంపు ప్రాంతాన్ని ఆ మరుసటి రోజు పరిశీలించారు. తమ గ్రామానికి వరదముంపు నుంచి శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు అధికారులను వేడుకున్నారు.


బ్రిడ్జి నిర్మాణంతోనే శాశ్వత పరిష్కారం 

బొదునంపల్లిలోకి వరదనీరు రాకుండా చేయాలంటే చిన్న బ్రిడ్జి నిర్మిస్తే సరిపోతుంది. కల్వర్టు ఉండడంతో వాగు ఉధృతంగా ప్రవహించినప్పుడు వరదనీరు వెనకకు తన్నుకు వస్తుంది దీంతో వాగు సమీపంలోని ఇళ్లలోకి వరదనీరు వస్తుంది. అధికారులు స్పందించి గ్రామానికి శాశ్వత పరిష్కారం చూపించాలి.

- లింగారెడ్డి, బొదునంపల్లి, కేశంపేట మండలం.



Updated Date - 2022-08-09T05:08:08+05:30 IST