రైలు ప్రయాణం చేస్తున్నారా.. లగేజీ ఎంతవరకు అనుమతిస్తారంటే...!
ABN , First Publish Date - 2022-06-04T14:57:19+05:30 IST
ఇప్పటి వరకు విమానాల్లో మాత్రమే ప్రయాణికుడి లగేజీపై పరిమితి ఉంది. ఇకపై రైళ్లలో కూడా పరిమితికి మించి లగేజీ తీసుకెళ్తే ప్రత్యేక రుసుము
పెరంబూర్(చెన్నై), జూన్ 3: ఇప్పటి వరకు విమానాల్లో మాత్రమే ప్రయాణికుడి లగేజీపై పరిమితి ఉంది. ఇకపై రైళ్లలో కూడా పరిమితికి మించి లగేజీ తీసుకెళ్తే ప్రత్యేక రుసుము వసూలుచేయనున్నట్లు దక్షిణ రైల్వే అధికారులు తెలిపారు. రైళ్లలో ఫస్ట్ క్లాస్ నుంచి ద్వితీయ శ్రేణి బోగీల్లో ప్రయాణికులు పరిమితంగా లగేజీ తీసుకెళ్లేందుకు అనుమతి ఉంది. ఏసీ బోగీలో 70 కిలోలు, ఏసీ-2 టైర్లో 50 కిలోలు, ఏసీ-3 టైర్లో 40 కిలోల లగేజీ ఉచితంగా తీసుకెళ్లవచ్చు. అలాగే, 2 క్లాస్ బోగీలో 40 కిలోలు, సాధారణ బోగీల్లో 35 కిలోల వరకు లగేజీ ఉచితంగా తీసుకెళ్లవచ్చు. కానీ, కొందరు నిర్ణీత బరువు కన్నా అధికంగా తీసుకెళ్తున్నట్లు రైల్వే శాఖకు ఫిర్యాదులందాయి. దీనిపై స్పందించిన రైల్వే శాఖ, అనుమతించిన లగేజీ కన్నా అధికంగా తీసుకెళ్తే ప్రత్యేక రుసుము చెల్లించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారికి ప్రత్యేక చార్జీతో పాటు పెనాల్టీ విధిస్తామని పేర్కొంది.